వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీలో హరీష్ సాల్వే- మతలబు?
న్యూఢిల్లీ: తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించబోతోండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టడానికే కేంద్రం ఈ సమావేశాలను ఏర్పాటు చేసిందనే అభిప్రాయాలు ఉన్నాయి.
అదే జరిగితే- రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. లోక్సభతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం, ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లకూ ఒకేసారి ఎన్నికలు జరగొచ్చు.

వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. దీన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తరువాతే.. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా పడొచ్చా? లేక షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయా? అనేది తేలుతుంది. అప్పటివరకు తెలంగాణలో ఎవరి రాజకీయ కార్యకలాపాల్లో వారు మునిగిపోయారు.
యధాతథంగా షెడ్యూల్ ప్రకారమే ఈ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితే తలెత్తితే మాత్రం అక్టోబర్/నవంబర్లల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. డిసెంబర్లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీనికోసం అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఈ కమిటీకి ఛైర్మన్గా అపాయింట్ చేసింది. ఆయన సారథ్యంలోని ఈ కమిటీ ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేస్తుంది.
మొత్తంగా ఎనిమిది మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. తాజాగా మిగిలిన ఏడుమంది సభ్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎన్ కే సింగ్, లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ డాక్టర్ సుభాష్ సీ కశ్యప్, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారిలను ఈ కమిటీ సభ్యులుగా నియమించింది.












Click it and Unblock the Notifications