బంగారు నిధి స్వామి అలక!: మరో సంచలనం, మోడీపై..
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని దౌండియా ఖేరా గ్రామంలోని ఓ కోట కింద వెయ్యి టన్నుల బంగరం ఉందని చెప్పిన సాధువు అలకబూనారట. కోట కింద బంగారు గని ఉందని స్వామి శోభన సర్కారు చెప్పడంతో అక్కడ తవ్వకాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ తవ్వకాలపై గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు కూడా.
కాగా, బంగరు నిధిని తవ్వడంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యవహరిస్తున్న తీరు పట్ల అలిగిన స్వామి శోభన్ సర్కార్ ఉన్నవ్ జిల్లాలోని తన ఆశ్రమాన్ని విడిచి అక్కడికి 100 కిలోమీటర్ల దూరాన కాన్పూర్లో ఉన్న తన మరో ఆశ్రమానికి వెళ్లిపోయారట. ఈ పని త్వరగా పూర్తి చేయడం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వల్ల కాదని, దీన్ని భారత సైన్యానికి అప్పజెప్పాలని ఆయన కోరుతున్నారట.
మరోవైపు స్వామి కలలో కనిపించిన బంగారు నిధిని వెలికి తీసే ప్రక్రియ మూడోరోజైన ఆదివారమూ నిదానంగా కొనసాగింది. ఉన్నవ్ జిల్లా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ విజయ్ శంకర్ దూబే, సర్కిల్ అధికారి చరణ్జీత్ సింగ్ ఆధ్వర్యంలో పురావస్తు శాఖ బృందం తవ్వకాలను కొనసాగించింది. నిధి కోసం తవ్వకాల నేపథ్యంలో వేలాదిగా ప్రజలు తరలివస్తున్నందు వల్ల ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, రాత్రి వేళల్లో దృశ్యాలను చిత్రీకరించే నైట్ విజన్ కెమెరాలను అమర్చనున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

తవ్వకాలు పూర్తి కావడానికి నెలరోజులు పడుతుందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. తాను కలగన్న ఈ వెయ్యి టన్నుల బంగారు నిధే కాదని, ఫతేపూర్ జిల్లాలోని ఆదంపూర్ గ్రామంలో 500 ఏళ్ల నాటి మరో కోట కింద 2500 టన్నుల పసిడి నిధి ఉందని స్వామి శోభన్ సర్కార్ మరో సంచలనానికి తెర తీశారు. ఈ మేరకు ఫతేపూర్ జిల్లా మేజిస్ట్రేట్కు ఒక లేఖ రాశారు. అటు కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్కూ ఒక లేఖ రాసి కాన్పూర్లోని చౌబే పూర్, పరేడ్ గ్రౌండ్ ప్రాంతాల్లో నిధుల కోసం అన్వేషించాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ నిధులకు సంబంధించి కొన్ని వివరాలను రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా పంపారు.
అంతేకాదు తాను చెప్పిన విషయాలు నిజంగా నిజమని, కావాలంటే ఈ విషయమై తాను 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తానని, తాను చెప్పింది తప్పని తేలితే నిధులు లేకుంటే ఆ డిపాజిట్ సొమ్మును స్వాధీనం చేసుకోవచ్చని, తనపై చట్టపరమైన చర్యలూ తీసుకోవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇంకోవైపు నిధి కోసం తవ్వకాల నేపథ్యంలో ముందు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని మన దేశానికి తిరిగి తీసుకురావాల్సిందిగా మోడీ చేసిన వ్యాఖ్యలకు శోభన్ సర్కార్ స్వామి స్పందించారు. ఈ మేరకు ఆయన ఆశ్రమం పేరిట ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

భారతదేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్ చేసేందుకే తాను నిధి విషయాన్ని ప్రకటించానని అందులో పేర్కొన్నారు. అదే సమయంలో భావి ప్రధానిగా మోడీకి ప్రచారం కల్పించేందుకు బిజెపి చేస్తున్న ఖర్చు నల్లధనమా? తెల్లధనమా అని ప్రశ్నించారు. వాజపేయి హయాంలోని ఎన్డీయే వైఫల్యాలపై లేఖలో ధ్వజమెత్తారు. శామ్ పిట్రోడా ఈ దేశంలోని ప్రభుత్వ విభాగాల్లో కంప్యూటర్లను ప్రవేశపెడుతున్నప్పుడు వాజ్పేయి సహా బీజేపీలో అందరూ వ్యతిరేకించారని, అలా వ్యతిరేకించడం తప్పని ఇప్పుడు ఒప్పుకొంటారా అని నిలదీశారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని బిజెపి ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోయిందని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications