Today gold price: భారీగా పెరిగిన బంగారం ధరలు, వెండి కూడా
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు కొత్త ఏడాదిలో భారీగా పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, రూపాయి క్షీణతతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో దేశీయంగానూ బంగారం ధరలపై ప్రభావం పడింది.

ఒక్కరోజే..
బులియన్ మార్కెట్లో పసిడి ధర మళ్లీ రూ. 40వేల మార్కును దాటింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 752 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 40,652కు చేరింది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. రూ. 960 పెరగడంతో కిలో వెండి ధర రూ. 48,870కి చేరింది.

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతతో బంగారం, వెండి ధరలు పైకి..
కాగా, ఇరాన్ కమాండర్ ఖాసీమ్ సులేమానిని అమెరికా హత్య చేయడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడులు పెట్టడమే మంచిదని మదపర్లు భావించడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతేగాక, రూపాయి మారకం విలువ కూడా పతనం కావడం కూడా బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.

గత రెండు వారాల్లోనే..
కాగా, ఎంసీఎక్స్ మార్కెట్లో మార్కెట్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ధర శుక్రవారం 1 శాతానికి పెరిగింది. రూ. 400 పెరుగుదలతో 10 గ్రాములకు రూ. 39,680 స్థాయికి చేరింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర గత రెండు వారాల్లో ఏకంగా రూ. 1700 పెరగడం గమనార్హం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలో పెరుగుదల నమోదవుతోంది.

అంతర్జాతీయంగానూ..
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఔన్స్ కు బంగారం ధర 1.05శాతం పెరుగులతో 1544.15 డాలర్ల స్థాయికి చేరింది. ఇది నాలుగు నెలల గరిష్టస్థాయి కావడం గమనార్హం. వెండి ధర కూడా ఔన్స్కు 0.98 శాతం పెరుగుదలతో 18.22 డాలర్లకు చేరింది. కాగా, రానున్న కాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications