గోల్డ్ స్మగ్లర్ల చేతులు కట్టేసిన కరోనా: దొంగ బంగారం దిగుమతులకు బ్రేక్: ఎలాగంటారా?
న్యూఢిల్లీ: నిజమే. కరోనా వైరస్ కొమ్ములు తిరిగిన గోల్డ్ స్మగ్లర్ల చేతులు కట్టేసింది. వారికి ఉపాధి లేకుండా చేసింది. దొంగ బంగారం దిగుమతికి బ్రేకులు వేసింది. అక్రమ రవాణాను ఎక్కడికక్కడ స్తంభింపజేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల బంగారం అక్రమ రవాణా కార్యకలాపాలన్నీ పూర్తిగా స్తంభించిపోయాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా..అక్రమ రవాణా వ్యవస్థ సద్దుమణిగిందని, దీని ప్రభావం గోల్డ్ స్మగ్లింగ్పై తీవ్రంగా ఉందని తేటతెల్లమైంది.

స్మగ్లర్ల ఆటకట్టు..
బంగారం క్రయ విక్రయాల్లో భారత్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో కొనసాగుతోంది. పసిడి పట్ల భారతీయులకు ఉన్న ఆసక్తి అలాంటిది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. 10 గ్రాముల ధర 50 వేల రూపాయలకు పైగా పలుకుతోంది. అదే బ్లాక్ మార్కెట్లో అయితే.. దాని ధర అంత ఉండకపోవచ్చు. పన్నులు, రవాణా ఖర్చులు ఇవేవీ ఉండవు కాబట్టి.. తక్కువ ధరకే విక్రయిస్తుంటారు స్మగ్లర్లు. తమకు ఉన్న ఛానళ్ల ద్వారా దొంగ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకొస్తుంటారు. 12.5 శాతం పన్ను చెల్లించనక్కర్లేదు వారికి.

వంద నుంచి 120 టన్నుల గోల్డ్ ఇన్ఫ్లో
సాధారణ పరిస్థితుల్లో సంవత్సరానికి వంద టన్నులకు పైగా బంగారం అక్రమంగా మార్కెట్లోకి ఇన్ఫ్లో అవుతుంటుంది. గోల్డ్ స్మగ్లర్లు తమ చాకచక్యంతో మార్కెట్లోకి చేరవేస్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం ఈ సంఖ్య దాదాపుగా పడిపోయింది. నెలకు రెండు టన్నులు లేదా సంవత్సరానికి సగటున 25 టన్నలు బంగారం కూడా ఇల్లీగల్ షిప్మెంట్ ద్వారా అందలేదని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాక్డౌన్ వల్ల ఈ ఏడాది అక్రమ బంగారం రవాణా ఇన్ఫ్లో భారీగా తగ్గిందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యవెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఎన్ అనంత పద్మనాభన్ అభిప్రాయపడ్డారు.

ఈ సారి 25 టన్నులకే
గత ఏడాది 120 టన్నుల మేర దొంగ బంగారం బులియన్ మార్కెట్లోకి ప్రవహించిందని, దేశీయంగా బంగారం కొనుగోళ్ల డిమాండ్తో పోల్చుకుంటే.. 17 శాతం గోల్డ్ అక్రమంగా ఇన్ఫ్లో అయిందని అన్నారు. ఈ సారి ఆ సంఖ్య 25 టన్నులకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు. భారత్ మాత్రమే కాకుండా.. బంగారాన్ని ఉత్పత్తి చేసే కొన్ని దేశాల్లోనూ లాక్డౌన్ ప్రభావం వల్ల గోల్డ్ స్మగ్లర్ల నెట్వర్క్ దెబ్బతిన్నట్టయిందని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు అమల్లోకి రావడం, సరిహద్దులను తెరవడం వంటి చర్యల తరువాత.. క్రమంగా బంగారం అక్రమ రవాణా పెరుగుతోందని అన్నారు.

సముద్రమార్గమే స్వర్గధామం..
విమానాల ద్వారా బంగారాన్ని అక్రమంగా తరలించడం సాధ్యం కాదని, విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టంగా ఉండే నిఘా వ్యవస్థ దీనికి కారణమని చెప్పారు. సముద్ర మార్గం గుండా భారీగా బంగారం అక్రమ రవాణా కొనసాగుతుంటుందని అన్నారు. నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కేంద్రంగా గోల్డ్ స్మగ్లర్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటారని, ఆయా దేశాల నుంచే భారత్కు పెద్ద మొత్తంలో బంగారం అందుతుంటుందని అంచనా వేశారు. సాధారణ రోజుల్లో ప్రతినెలా భారత విమానాశ్రయాల్లో సగటున 20.6 కేజీల దొంగ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటుంటారని తెలిపారు. ఈ సారి ఆ పరిస్థితి లేదని చెప్పారు.

మూడేళ్ల వ్యవధిలో..
మూడేళ్ల వ్యవధిలో గరిష్ఠంగా మూడు టన్నుల వరకు దొంగ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య నామమాత్రంగా కూడా లేదు. 217-18లో రెండు టన్నులు, 2018-19లో మూడు టన్నులు, 2019-2020లో రెండున్నర టన్నుల దొంగ బంగారాన్ని అధికారులు సీజ్ చేయగా.. ఈ ఏడాది దాని సంఖ్య జీరో మాత్రమే. శ్రీలంక నుంచి అత్యధికంగా బంగారాన్ని భారత్కు తరలిస్తుంటారని ఓ అంచనా. శ్రీలంక నుంచి బయలుదేరిన 45 నిమిషాల వ్యవధిలో స్మగ్లర్లు దక్షిణాది రాష్ట్రాలకు దొంగబంగారాన్ని చేరవేస్తుంటారని చెబుతుంటారు.












Click it and Unblock the Notifications