గోల్డెన్ గర్ల్: 8 బంగారు పతకాలు.. సత్తా చాటిన పేదింటి 'చదువల తల్లి'
శుక్రవారం నాడు బెంగుళూరు యూనివర్సిటీ 52వ స్నాతకోత్సవం సందర్బంగా సౌజన్యకు 8 బంగారు పతకాలతో పాటు నగదు బహుమతిని అందజేశారు.
బెంగుళూరు: పేదరికం తన ఆశయం ముందు చిన్నబోయింది. ప్రతిభతో ఆర్థిక ప్రతికూలతలను సైతం అధిగమించి.. చదువుల్లో తన సత్తా చాటింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. బెంగుళూరుకు చెందిన సౌజన్య అనే పేదింటి విద్యార్థిని విజయ గాథ ఇది.
తాను పదో తరగతి పరీక్ష రాసిన రోజే.. తండ్రి మరణించడం ఆమె జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేని విషాదం. తండ్రి మరణంతో కుటుంబ పోషణ పెనుభారమైన తరుణంలో.. తల్లి కూలీ నాలి చేసి ఆమెను చదివించింది. తల్లి పడుతున్న కష్టాన్ని గుర్తెరిగిన వ్యక్తిగా.. చదువులో అసలేమాత్రం అలసత్వం వహించలేదు సౌజన్య.

రోజురోజుకు తన ప్రతిభను మరింత సానుపెడుతూ పీజీ దాకా చేరుకున్న సౌజన్య.. పీజీలోను అత్యుత్తమ మార్కులతో సత్తా చాటింది. శుక్రవారం నాడు బెంగుళూరు యూనివర్సిటీ 52వ స్నాతకోత్సవం సందర్బంగా సౌజన్యకు 8 బంగారు పతకాలతో పాటు నగదు బహుమతిని అందజేశారు.
భవిష్యత్తులో పీహెచ్.డీ చేయడంతో పాటు ఐఏఎస్ అధికారి కావడమే తన లక్ష్యంగా ప్రస్తుతం సౌజన్య ముందుకు సాగుతోంది.












Click it and Unblock the Notifications