రైతులకు శుభవార్త.. ఖరీఫ్ సీజన్ పంటలకు కేంద్రం మద్దతుధర పెంపు
కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరుగాలం శ్రమించి పంట పండించినా గిట్టుబాటు ధర రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలకు కేంద్రం అండగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే పంటలకు మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. 2022-23 మార్కెటింగ్ సీజన్కు అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంపునకు జూన్ 8, బుధవారం ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) కీలక భేటీ నిర్వహించి ఆమోదం తెలిపింది.
సాగుదారులైన రైతులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం 2022-2023 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచింది. 17 పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. సోయాబీన్ క్వింటాలుకు కనీస మద్దతు ధర మూడువందల రూపాయల పెంపు చేస్తున్నట్టు పేర్కొంది. క్వింటాలు కందుల పై మూడు వందల రూపాయల పెంపు, పెసలు మద్దతు ధర క్వింటాలుకు 480 రూపాయల పెంపు, నువ్వులు క్వింటాల్కు రూ.523 గా పేర్కొంది. పొద్దుతిరుగుడు మద్దతు ధర క్వింటాలుకు 385 రూపాయలు పెంచుతున్నట్లు వెల్లడించింది.
గత సంవత్సరం కంటే కనీస మద్దతు ధరలు అత్యధికంగా పెంచినట్టు పేర్కొంది. విలేఖరుల సమావేశంలో సమాచార మరియు ప్రసార (ఐ అండ్ బి) మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ దిగుమతులపై ఆధారపడటం తగ్గిందని పేర్కొన్నారు. దీంతో రైతుల ఆదాయం పెరిగిందని వెల్లడించారు. ఆమోదించబడిన రేట్లు కనీసం 1.5 రెట్ల స్థాయిలో కనీస మద్దతు ధరలను నిర్ణయించే సూత్రానికి అనుగుణంగా ఉన్నాయి అని సమాచార మరియు ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
Cabinet approves MSPs for Kharif Marketing Season 2022-23: Union Minister Anurag Thakur pic.twitter.com/SIaZgb8EBF
— ANI (@ANI) June 8, 2022
ఇక అంతేకాదు రైతులను దృష్టిలో పెట్టుకుని వారికి మేలు చేకూర్చేలా అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక తాజాగా రైతులకు వాతావరణ సూచన అందించే విధంగా హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు వారి స్థానిక భాషలోనే వాతావరణ సలహాలను ఎస్ఎంఎస్ పంపించటానికి కూడా నిర్ణయం తీసుకుంది ఐఎండీ.