గూగుల్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..!!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం, టాప్ సెర్చింజిన్ గూగుల్, ఆల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్.. ఇవ్వాళ దేశ రాజధానిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. మర్యాదపూరకంగా ఆమెతో భేటీ అయ్యారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరుకున్న ఆయనకు అక్కడి ఉద్యోగులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వారిద్దరి మధ్య భేటీ సాగింది.
విశాఖలో ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్- కేంద్రానికి ప్రతిపాదనలు..!!
ఈ సందర్భంగా గూగుల్ ప్రచురించిన స్టోరీస్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని సుందర్ పిచాయ్.. రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించారు. ప్రత్యేకించి దేశంలో డిజిటల్ లిటరసీ ప్రాజెక్ట్ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. డిజిటల్ వినియోగం భారీగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని మరింత విస్తృతం చేయడానికి, సామాన్యులు కూడా సులభంగా అర్థం చేసుకునేలా డిజిటల్ లిటరసీ ప్రాజెక్ట్ను చేపట్టాలనే ఆలోచన ఉన్నట్లు సుందర్ పిచాయ్ వివరించినట్లు తెలుస్తోంది.
దేశంలో డిజిటల్ అక్షరాస్యతకు పెంపొందించడానికి కృషి చేయాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా సుందర్ పిచాయ్కు సూచించారు. ప్రతి గ్రామాన్ని కూడా డిజిటలీకరించడానికి ప్రాధాన్యత ఇస్తోన్నామని అన్నారు. స్పీడ్-సింప్లిసిటీ- సర్వీస్ అనే నినాదంతో భారత్ పని చేస్తోందని, భారత్లో జరుగుతున్న డిజిటల్ విప్లవాన్ని గూగుల్ పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు. డిజిటల్ ఇండియా విజన్ ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో పురోగతిని సాధిస్తుందని అన్నారు.
కాగా- సుందర్ పిచాయ్.. ఇటీవలే పద్మభూషణ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. అమెరికాలోని భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు- ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. వాణిజ్యం-పరిశ్రమల విభాగంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన భారతీయుడు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును అందజేసింది.
ఈ ఏడాది ఆరంభంలో పద్మ అవార్డులను ప్రకటించిన వారి జాబితాలో సుందర్ పిచాయ్ పేరును చేర్చింది. ఇదివరకే భారత్లో వారందరికీ రాష్ట్రపతి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సుందర్ పిచాయ్ హాజరు కాలేకపోయారు. దీనితో రాయబారి తరణ్జిత్ సింగ్ సంధు ఆయనకు దీన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ నాగేంద్ర ప్రసాద్, సుందర్ పిచాయ్ కుటుంబ సభ్యులు, బంధువులు, అతికొద్దిమంది ప్రతినిధులు హాజరయ్యారు.