ప్రముఖ కంటిశస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామికి గూగుల్ ఘననివాళి
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ గోవింద్ వెంకటస్వామి 100వ జయంతి సందర్భంగా ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ తన ఘననివాళులు అర్పించింది. గూగుల్ హోమ్పేజ్పై డాక్టర్ గోవింద వెంకటస్వామి ఫోటోను ఉంచింది. తన మిత్రులు పేషెంట్లు డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామిని ముద్దుగా డాక్టర్ వీ అని పిలుచుకునేవారు. ఆయన ప్రముఖ కంటి ఆస్పత్రి అరవింద్ ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు. కేవలం 11 పడకలతో ప్రారంభమైన ఆస్పత్రి అనతికాలంలోనే దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఎంతో మందికి కంటి శస్త్ర చికిత్స సర్జరీలు అరవింద ఐ ఆస్పత్రి ద్వారా జరిగాయి.

30 ఏళ్ల వయస్సులోనే కీళ్ల నొప్పులు
తమిళనాడులోని వడమలపురంలో అక్టోబర్ 1, 1918లో డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి జన్మించారు. 30 ఏళ్ల వయస్సులోనే ఆయన వృద్ధాప్య కీళ్ల నొప్పులతో బాధపడ్డారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తాను చేయాల్సిన పనిని మాత్రం ఆపలేదు. ఇక ఆయన బాల్యం కూడా చాలా కష్టతరంగానే సాగింది. చదువుకోవాలని చాలా ఆశగా ఉండేది గోవిందప్పకు. అప్పట్లో పెన్సిల్ పేపర్ లేనందున నది ఒడ్డున ఉన్న ఇసుకలో ఓనమాలు దిద్దారు. ఆ తర్వాత మదురైలోని అమెరికన్ కాలేజీలో రసాయనశాస్త్రం చదివారు. 1944లో స్టాన్లీ మెడికల్ కాలేజీ నుంచి ఎండీ పట్టా పొందారు.

వ్యాధితో ఏడాది పాటు మంచంపైనే..
మెడికల్ స్కూలు నుంచి బయటకు వచ్చాక ఇండియన్ ఆర్మీ మెడికల్ కార్ప్స్లో ప్రసూతి విభాగంలో చదువును కొనసాగించారు. అదే సమయంలో కీళ్ల నొప్పుల వ్యాధితో ఇబ్బందిపడుతుండటంతో అక్కడ కెరీర్ను అర్థాంతరంగా ముగించేశారు. దాదాపు ఒక ఏడాదికి పైగా మంచంపైనే ఉన్నారు. నయం కాగానే 1951లో కంటిశస్త్ర చికిత్స విభాగంలో పట్టా పొందారు. అక్కడే సర్జరీ ద్వారా కంటిశుక్లాలు తొలగించడం నేర్చుకున్నారు. ఇక అప్పటి నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు.

రోజుకు 100 కంటిశస్త్ర చికిత్సలు చేసేవారు
డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి రోజుకు 100 కంటి ఆపరేషన్లు చేసేవారట. కళ్లు లేకుంటే జీవితం ఎంత దుర్భరమో తెలుసుకున్న గోవిందప్ప... కళ్లపై అవగాహన కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించేవారు. అంధులకు పునరావాసకేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆప్తాలమిక్ అసిస్టెంట్లకు ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి లక్షకుపైగా కంటి సర్జరీలు చేశారు. ఈ క్రమంలోనే 1973లో భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తిస్తూ పద్మశ్రీతో సత్కరించింది.

11 పడకల ఆస్పత్రి నుంచి 4వేల పడకల ఆస్పత్రిగా రూపాంతరం
1970వ దశకంలో డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి అరవింద్ కంటి ఆస్పత్రిని స్థాపించారు. ఆ సమయంలో చాలామంది వైద్యులు తమ ఇళ్లను తాకట్టు పెట్టి ఈ ఆస్పత్రి నిర్మాణానికి సహాయం చేశారు. వారి ఇళ్లలోని ఫర్నీచర్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా 11 పడకలతో ప్రారంభమైన ఆస్పత్రి నేడు 4వేల పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందింది. ఏడాదికి 2లక్షల ఆపరేషన్లు ఈ ఆస్పత్రిలో జరుగుతున్నాయి. ఇందుకోసం నామమాత్రపు రుసుం లేదా ఉచితంగానే శస్త్రచికిత్స చేస్తున్నారు. 2006 జూలై 7న చాలామందికి కంటిచూపుతో వెలుగునిచ్చిన డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామి తుదిశ్వాస విడిచారు. ఆయన ఎంతోమందికి కంటి చూపునిచ్చారు. ఇక చూడలేము అనుకున్నవారి కళ్లలో కూడా చూపుతో వెలుగు నింపారు. అందుకే గూగుల్ డూడుల్ డాక్టర్ గోవిందప్ప వెంకటస్వామికి ఘన నివాళులు అర్పించింది.












Click it and Unblock the Notifications