పెద్ద పెద్దోళ్లు వస్తేనే క్లీన్ చేస్తారా?: జిన్ పింగ్ టూర్ పై మద్రాస్ హైకోర్టు
చెన్నై: ఏ ప్రధాన మంత్రో, ముఖ్యమంత్రో.. లేక ఏ మంత్రో ఫలానా ప్రాంతాన్ని సందర్శిస్తున్నారంటే వారి రాక ముందే అక్కడ రోడ్లు వేయడం, ఆ ప్రాంతంలో చెత్తా, చెదారం లేకుండా చేయడం మనదేశ సాధారణంగా కనిపించే దృశ్యాలే. ఆ లీడర్.. సదరు ప్రాంతాన్ని ఖాళీ చేసిన వెళ్లిన తరువాత ఇక దాని బాగోగులను పట్టించుకునే వారే ఉండరు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ బేసిక్ ఫార్ములానే ఫాలో అవుతోంది. సాధారణంగా చెత్తా చెదారం, దుమ్మూ ధూళి, వాహనాల రాకపోకలతో నిండిపోయి ఉంటుంది గిండీ రూట్. అలాగే- వచ్చీ పోయే వందలాది మంది పర్యాటకులతో గజిబిజీగా కనిపిస్తుంటుంది మహాబలిపురం అలియాస్ మామళ్లాపురం.
చైనా..పాకిస్తాన్ వైపేనా? ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్, డోక్లామ్: కళ్లు కాయలు కాచేలా ఇమ్రాన్
చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ రాక సందర్భంగా ఆయన రాకపోకలు సాగించే గిండీ మార్గాన్ని అద్దంలా తీర్చిదిద్దింది తమిళనాడు ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-జిన్ పింగ్ భేటీకి వేదికగా మారిన మామళ్లాపురాన్ని స్వచ్ఛ భారత్ కు బ్రాండ్ అంబాసిడర్ లా తయారు చేసింది. ప్రభుత్వ వైఖరి చివరికి మద్రాస్ హైకోర్టును కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్న మొన్నటి దాకా దుమ్ము కొట్టుకుని పోయి, చిరిగిపోయిన బ్యానర్లతో కనిపించే మార్గాలు, మామళ్లాపురం ఇంత అందంగా తయారు కావడం ముక్కు మీద వేలేసుకునేలా చేసింది.
అందుకే- బడా నాయకులు వస్తేనే క్లీన్ చేస్తారా?, క్లీన్ గా ఉండాలంటే ఆ స్థాయి నాయకులు రోజూ వస్తేనే బెటరేమో.. అంటూ చెణుకులు విసిరారు న్యాయమూర్తులు. చెన్నై నగర వ్యాప్తంగా ఇష్టానుసారంగా కట్టిన బ్యానర్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కొద్ది రోజుల కిందట మద్రాస్ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. గురువారం వాదోపవాదాలను చేపట్టింది. మద్రాస్ హైకోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు ఎస్ వైద్యనాథన్, సీ శరవణన్ ఈ పిటీషన్ ఇరు పక్షాల వాదనలను ఆలకించారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బ్యానర్ల తొలగింపు వ్యవహారం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అనే విషయాన్ని ఒకరు గుర్తు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం కొని తెచ్చుకుంటోందని న్యాయమూర్తులు అన్నారు. రోడ్లు, వీధులు, పర్యాటక కేంద్రాల వంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వ కనీస బాధ్యత అని, దాన్ని మరొకరు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద నాయకులు వస్తేనే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటాయనే విషయాన్ని ప్రభుత్వం మరోసారి గుర్తు చేసిందని జిన్ పింగ్ పర్యటన గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద నాయకులు వస్తేనే పరిసరాలను క్లీన్ గా ఉంచుతామని ప్రభుత్వం భావిస్తే.. అలాంటి నాయకులు రోజూ వస్తే బాగుంటుందని చెప్పారు.