రాజ్యసభకు కొత్తగా నలుగురు సభ్యులను నామినేట్ చేసిన రాష్ట్రపతి: వారెవరంటే..?
Recommended Video
న్యూఢిల్లీ: రాజ్యసభకు కొత్తగా నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. బీజేపీ మాజీ ఎంపీ రామ్ శకల్, ప్రముఖ రచయిత రాకేశ్ సిన్హా, కళాకారుడు రఘునాథ్ మొహ పాత్ర, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మన్సింఘ్లను రాష్ట్రపతి శనివారం రాజ్యసభకు నామినేట్ చేశారు.
రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్, బాలీవుడ్ నటి రేఖ, పారిశ్రామిక వేత్త అను అఘా, న్యాయవాది కె పరాశరణ్ ఇటీవలే పదవీ విరమణ చేసిన నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్త సభ్యులను రాష్ట్రపతి శనివారం నామినేట్ చేశారు.
రాకేష్ సిన్హా
రాకేష్ సిన్హా ఢిల్లీకి చెందిన ఇండియా పాలసీ ఫౌండేషన్కు వ్యవస్థాపకులు. ప్రస్తుతం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్లో సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ రచయిత, కాలమిస్ట్ కూడా.
రఘునాథ్ మొహపాత్ర..
ఒడిశాకు చెందిన రఘునాథ్ మొహపాత్ర అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శిల్పకారుడు. ఆయన చెక్కిన ఆరు అడుగుల సూర్యదేవుడి విగ్రహం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉంది. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2013లో పద్మవిభూషణ్తో సత్కరించింది.
సోనాల్ మాన్సింగ్
ప్రముఖ సంప్రదాయ నృత్య కళాకారిణి అయిన సోనాల్ మాన్సింగ్ గత ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, ఒడిశి నృత్యాలతో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. అంతేగాక, ఆమె సామాజిక కార్యకర్త కూడా. 2004లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.
రామ్ శకల్
ఉత్తర్ప్రదేశ్కు చెందిన రామ్ శకల్.. రైతులు, దళితులు, కూలీల అభ్యున్నతి కోసం విశేష పోరాటం చేశారు. అంతేగాక, రాబర్ట్స్గంజ్ నుంచి మూడు సార్లు ఎంపీగా పనిచేశారు. ఈ నలుగురు కూడా విభిన్న రంగాల్లో తమ చెరగని ముద్రను వేసిన వారే కావడం గమనార్హం.