నాలుగ్గోడల మధ్య బందీగా..అల్కహాల్తో కూడిన: కరోనా అనుమానితులకు స్వీయ గృహ నిర్బంధానికి గైడ్లైన్స్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్-19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి ఈ సంఖ్య 147కు చేరుకుంది. కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇంతకంటే ఎక్కువ. కరోనా వైరస్ అనుమానితుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుజాగ్రతగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. దాదాపు అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశాయి. కోవిడ్-19 అనుమానితుల కేసులు మరింత పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని కేంద్రం ఆదేశించింది. దీనికోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
నాలుగు గోడల మధ్యే..
కరోనా వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి.. తన ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండాల్సి ఉంటుందని సూచించింది. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించే గదిలో ఒంటరిగా గడపాలని పేర్కొంది. తాను వినియోగించే ఏ ఒక్క వస్తువును కూడా ఇతర కుటుంబ సభ్యులకు తాకనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖానికి ఎప్పుడూ మాస్క్ను ధరించే ఉండాలని, ప్రతి ఏడెనిమిది గంటలకొకసారి దాన్ని మార్చుతూ ఉండాలని పేర్కొంది. కుటుంబ సభ్యులు కూడా అదే గదిలో నివసించాల్సిన పరిస్థితి ఉంటే.. బాధితుడితో కనీసం ఒక మీటర్ దూరంగా ఉండాలని, అతనితో మాట్లాడేటప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు దూరంగా..
కరోనా వైరస్ అనుమానితుడు అల్కహాల్తో కూడిన శానిటైజర్తో తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలకు తప్పనిసరిగా దూరంగా ఉండాలని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుభకార్యాలకు దూరంగా ఉండాలని సూచించింది. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదరైనప్పటికీ.. వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని లేదా 011-23978046కు గానీ ఫోన్ చేయాలనీ కేంద్రం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దని పేర్కొంది.
14 రోజుల పాటు తప్పనిసరిగా..
ఇలా 14 రోజుల పాటు తప్పనిసరిగా కరోనా వైరస్ అనుమానితులు తమకు తాముగా స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని, అలాంటప్పుడే ఈ మహమ్మారి ఇతరులకు సోకకుండా ఉంటుందని కేంద్రం పేర్కొంది. అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన కరోనా వైరస్పై ప్రపంచ దేశాలు మూకుమ్మడిగా పోరాటాన్ని సాగిస్తున్నాయని, ప్రతి పౌరుడు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించాలని విజ్ఙప్తి చేసింది. ఏ మాత్రం అనుమానిత లక్షణాలు కనిపించినప్పటికీ.. స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించే సామర్థ్యం ప్రజల చేతుల్లోనే ఉందని పేర్కొంది.