వచ్చే ఏడాదిలో ఎల్ఐసీ ఐపీఓ: బీమా రంగంలో 74 శాతానికి ఎఫ్డీఐలు
న్యూఢిల్లీ: బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్ డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా వివరించారు.
ఎఫ్డీఐ పరిమితిని పెంచేందుకు బీమా చట్టం 1938కి సవరణ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్మెంట్కు చెందిన వ్యక్తులు భారతీయులే అయి ఉండాలన్న నిబంధన విధించినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. 50 శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాలన్నారు.
ఇక 2022 ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) ను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ సెషన్లో పార్లమెంటులో ఈ ప్రభావానికి సంబంధించిన శాసన సవరణలను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
'మేము 2021-22లో ఎల్ఐసి ఐపీఓను కూడా తీసుకువస్తాము, దాని కోసం ఈ సెషన్లోనే అవసరమైన సవరణలను తీసుకువస్తున్నాం' అని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
ఆర్థిక సంవత్సరం 2022 కోసం ప్రభుత్వం 1.75 లక్షల కోట్ల ఉపసంహరణ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్థిక ఏడాది2021లో, ప్రభుత్వం రూ. 2.1 లక్షల కోట్లు డివైస్మెంట్ల ద్వారా సేకరించాలని బడ్జెట్ను నిర్ణయించింది, కానీ బిపిసిఎల్, ఎల్ఐసిల పెట్టుబడులు ఈ సంవత్సరంలో పూర్తి చేయలేకపోవడంతో లక్ష్యాన్ని సాధించలేకపోయారు.