అనాలిసిస్: మహారాష్ట్రలో హైడ్రామా.. గవర్నర్ ఏం చేయబోతున్నారు..?
శనివారంతో మహారాష్ట్ర అసెంబ్లీ గడవు ముగియనుంది. ఇంకా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడటం లేదు. బీజేపీ శివసేనల మధ్య ఏర్పడిన దూరమే ఇందుకు కారణం. ఇక అసెంబ్లీ గడువు ముగిశాక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రం రాష్ట్రపతి పాలన కిందకు వెళ్లిపోతుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి కీలకం కానున్నారు.

కీలకంగా మారనున్న గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి
శనివారంతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు అతని కేబినెట్ మంత్రులు కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెల్చుకున్న సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ భగత్ సింగ్ ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ-శివసేనల మధ్య ముఖ్యమంత్రి పదవిపై బిగుసుకుపోయిన పీఠముడి ఇంకా వీడలేదు. రొటేషనల్ పద్దతిలో ముఖ్యమంత్రి పదవి ఉండాలని శివసేన డిమాండ్ చేస్తుండగా ఇందుకు బీజేపీ ఒప్పుకోవడం లేదు.

సింగిల్ లార్జెస్ట్ పార్టీకి తొలి అవకాశం ఇవ్వనున్న గవర్నర్
ఇక అత్యధిక సీట్లు గెల్చిన అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కమలం పార్టీని ఆహ్వానించే అవకాశం ఉంది. ఆ తర్వాత బలనిరూపణకు కొంత సమయం ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అది గవర్నర్ అభీష్టం మేరకే ఉంటుంది. అయితే గవర్నర్ ఇచ్చిన గడవులోగా బలనిరూపణ ఫడ్నవీస్ చేసుకోకపోతే, మరో రాజకీయ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానం పలికే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఉండాలని కోరే అవకాశం ఉంది. మరోవైపు ఇచ్చిన గడువులోగ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే మరింత గడవు ఇచ్చే ఆస్కారం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

రెండో పార్టీ కూడా విఫలమైతే రాష్ట్రపతి పాలనే
ఇక రెండో పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటులో విఫలమైతే ఇక రాష్ట్రపతి పాలనకు గవర్నర్ రికమెండ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అని రాష్ట్రపతి చేతిలోకి వెళ్లనుండగా, చట్టాలు చేసే అధికారాలన్నీ పార్లమెంటు చేతిలోకి వెళ్లిపోతాయి.అయితే రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడే ఏదైనా ఒక పార్టీ తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ముందుకు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం జరుగుతుంది.

గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది..?
ప్రస్తుతం మహారాష్ట్రలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా గవర్నర్ భగత్సింగ్ న్యాయసలహా కోసం ఆరాష్ట్ర అడ్వకేట్ జనరల్ అశుతోష్ కుంభకోనిని తనను కలవాల్సిందిగా కోరారు. అయితే ఇలాంటి పరిస్థితే గతంలో కూడా తలెత్తింది. 2004లో అప్పటి కొత్త ప్రభుత్వం నవంబర్ 4న ప్రారంభమైంది.వాస్తవానికి అసెంబ్లీ గడువు అక్టోబర్ 19కి ముగిసినప్పటికీ రెండు వారాల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది.

ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీం తీర్పు ఏమిటి..?
ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇప్పటికే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అతిపెద్ద పార్టీని ఆహ్వానించడంలో చాలా సమయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎస్ఆర్ బొమ్మై కేసు తీర్పు ప్రకారం అత్యధిక సీట్లు గెల్చుకున్న అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి బలనిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంటుందని రిటైర్ సుప్రీంకోర్టు జస్టిస్ పీబీ సావంత్ చెప్పారు.












Click it and Unblock the Notifications