జిమ్స్,యోగా సెంటర్స్ రీఓపెన్... కేంద్రం తాజా మార్గదర్శకాలు... ఈ నిబంధనలు తప్పనిసరి...
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్నాళ్లు మూతపడ్డ జిమ్ సెంటర్స్,యోగా ఇనిస్టిట్యూట్స్ అగస్టు 5 నుంచి తెరుచుకోనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని జిమ్స్,యోగా ఇనిస్టిట్యూట్స్ మాత్రం మూసే ఉంటాయి. అన్లాక్ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే స్విమ్మింగ్ పూల్స్,స్పా,స్టీమ్ బాత్ వంటి వాటికి మాత్రం ఇంకా అనుమతినివ్వలేదు. జిమ్స్,యోగా ఇనిస్టిట్యూట్స్ పాటించాల్సిన నిబంధనలను తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.
65 ఏళ్ల పైబడ్డ వృద్దులు,ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు,గర్భిణీ స్త్రీలు,చిన్నారులు జిమ్స్,యోగా ఇనిస్టిట్యూట్స్కి దూరంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో యోగాసనాలు వద్దని సూచించింది.జిమ్,యోగా ఇనిస్టిట్యూట్స్లో ఒకేసారి గుంపులుగా ఎక్కువమందిని అనుమతించకుండా... బ్యాచ్ల వారీగా క్లాసులను ప్లాన్ చేయాలని సూచించింది. ఒక్కో బ్యాచ్కి మధ్య 15-30 నిమిషాల గ్యాప్ ఉండాలని తెలిపింది. ఎప్పటికప్పుడు శానిటైజేషన్,క్లీనింగ్ చేపట్టాలని సూచించింది.
ఆక్సిజన్ లెవల్ 95శాతం కంటే తక్కువ ఉన్నవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామానికి అనుమతించవద్దని సూచించింది. యోగా లేదా జిమ్ సెంటర్లో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఆరడుగుల దూరం పాటించాలని సూచించింది. అలాగే తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించాలని తెలిపింది. అయితే మాస్కులు ధరించడం ద్వారా శ్వాసపరంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు విజర్ ధరించాలని సూచించింది. దగ్గినప్పుడు,తుమ్మినప్పుడు మోచేతిని అడ్డు పెట్టుకోవాలని... టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకుని ముక్కు చీదాలని సూచించింది.
జిమ్ లేదా యోగా సెంటర్లో శిక్షణ ఇచ్చే ఫ్లోర్లో ఒక్కో వ్యక్తికి 4m2 స్థలం ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేసుకోవాలి. జిమ్ పరికరాలు,మెషినరీ ఆరడగుల దూరంలో ఉండాలి. లోపలికి వచ్చేటప్పుడు,వెళ్లేటప్పుడు వేర్వేరు మార్గాలు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సిబ్బంది సంఖ్య కూడా అవసరం మేరకే ఉండాలి.సాధ్యమైనంతవరకూ కాంటాక్ట్లెస్ లావాదేవీలనే జరపాలి. ఎటువంటి కరోనా లక్షణాలు లేనివారికి మాత్రమే అడ్మిషన్ ఇవ్వాలి. ప్రతీ ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. నిర్వాహకులు ప్రతీ ఒక్కరి చెక్-ఇన్,చెక్-ఔట్ టైమింగ్స్ను పక్కాగా మెయింటైన్ చేయాలి.