లోకసభ ఎన్నికల ఖర్చు 3,426 కోట్లు, 2009లో ఇంతే
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికలకు అయిన ఖర్చు అక్షరాలా రూ.3,426 కోట్లు! ఈసారి జరిగిన లోకసభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రూ.3,426 కోట్లను ఖర్చు చేసింది. ఇంతకు ముందు 2009లో జరిగిన ఎన్నికల వ్యయం కంటే ఇది 131 శాతం ఎక్కువ.
ఐదేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలకు అప్పట్లో రూ.1,483 కోట్లు ఖర్చు అయింది. 1952లో ఒక్కో ఓటరుకు సగటున 60 పైసల వరకు ఖర్చు కాగా, 2009లో అది 12 రూపాయలకు చేరుకుంది. 1952లో మొత్తం వ్యయం రూ.10.45 కోట్లు మాత్రమే. 2009 నాటికి అది రూ.1,483 కోట్ల రూపాయలకు చేరుకుంది.

పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకోవడం, ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం కూడా భారీగా పెరిగిపోవడం వల్లే ఈసారి మూడువేల కోట్లకు పైగా ఖర్చయినట్లు ఎన్నికల సంఘం చెబుతోంది.
ఈసారి అనేక పార్టీలు రాజకీయాల్లోకి కొత్తగా రావడం, పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య కూడా పెరగడంతో ఎన్నికల వ్యయం ఎక్కువ కావడానికి కారణమని తేలింది. ఓటరు స్లిప్పులను ఇంతకు ముందు రాజకీయ పార్టీలు పంచేవి. ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి, స్లిప్పులను పంపిణీ చేయించింది. దీనికి కూడా ఖర్చు బాగానే అయ్యింది.












Click it and Unblock the Notifications