నెట్ న్యూట్రాలిటీపై దద్దరిల్లింది: రాహుల్ నిలదీత, ధీటుగా రవిశంకర్
న్యూఢిల్లీ: లోకసభలో బుధవారం ఇంటర్నెట్ సమానత్వం పైన చర్చ జరిగింది. నెట్ న్యూట్రాలిటీ పైన సభ దద్దరిల్లింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నెట్ న్యూట్రాలిటీ అంశాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సభలో లేవనెత్తారు.
దీనిపై చర్చ సమయంలో అధికార, విపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నెట్ న్యూట్రాలిటీ పేరుతో కార్పోరేట్లకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదని, అంతర్జాతీయ సమానత్వంపై చట్టం తేవాలన్నారు. నెట్ కార్పోరెట్ గుప్పిల్లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ ధీటుగా స్పందించారు. ఇంటర్నెట్ సమానత్వం పైన తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. స్పెక్ట్రం వేలంలో అధిక బిడ్లు రాబట్టిన ఘనత తమదే అన్నారు. నెట్ న్యూట్రాలిటీ తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కార్పోరేట్ వర్గాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గుతోందన్నారు.
తాము యూపీఏలా కార్పోరేట్లకు ఎప్పుడూ తలొగ్గలేదని చెప్పారు. ఉచిత ఇంటర్నెట్ సౌకర్యానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అంతర్జాతీయ సమానత్వంపై తమ ప్రభుత్వ నిబంధనలు రూపొందిస్తుందన్నారు. గతంలో స్పెక్ట్రం వేలంలో రూ.లక్షా పదివేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలా గందరగోళం సృష్టిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.