30 కోట్ల మందికి ఇచ్చే వ్యాక్సిన్ ఖర్చును మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది: వినోద్ పాల్
న్యూఢిల్లీ: తొలి దశ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా 30 కోట్ల మంది ప్రాధాన్యత గ్రూప్స్కు చెందిన వ్యక్తులకు ఇచ్చే వ్యాక్సిన్ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు, నేషనల్ కోవిడ్ 19 టాస్స్ ఫోర్స్ అధిపతి డాక్టర్ వినోద్ పాల్ స్పష్టం చేశారు. రాబోయే 6-8 నెలల్లో కరోనా ఫ్రంట్లైన్ వర్కర్స్ ముఖ్యంగా ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నవారు, వృద్ధులకు ప్రాథమిక వ్యాక్సినేషన్ దశలో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 29వేల వ్యాక్సినేషన్ పాయింట్లకు వ్యాక్సిన్ల సరఫరా కోసం 31 హబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఓ జాతీయ మీడియాతో డాక్టర్ పాల్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇండస్ట్రీ, ప్రభుత్వం, స్టేక్ హోల్డర్స్ అంతా కలిసి ఒక టీంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. 300 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
దేశ వ్యాప్తంగా ఉన్న ఆరోగ్యశాఖ సిబ్బందికి మొదటగా ప్రాధాన్యత ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రంగా ఉన్న బాధితులకు కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు. కోవిడ్ మరణాలను తగ్గించేందుకు రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి కరోనా వ్యాక్సిన్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
రానున్న రోజుల్లో వ్యాక్సిన్ల స్టాక్ భారీగా పెరగవచ్చని డాక్టర్ పాల్ తెలిపారు. ప్రస్తుతం తాము మొదటగా హెర్డ్ ఇమ్యూనిటీని పెంచాలని చూస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు చెందిన కోవిషీల్డ్కు నిపుణుల కమిటీ ఆమోదంపై ఆయన స్పందించారు. ఎస్ఈసీ భారత ట్రయల్స్ తోపాటు ఇతర దేశాల నుంచి తీసుకున్న డేటాను పరిశీలిస్తోందని చెప్పారు.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) నిపుణుల కమిటీ శుక్రవారం ఆస్ట్రాజెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ను అత్యవసర వినియోగం కోసం అనుమతి ఇచ్చిన విషయం తెలిసందే. ఇది ఇలావుండగా, శనివారం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహణపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇప్పటికే సమీక్షించారు. ఇప్పటికే రెండు వ్యాక్సిన్ కంపెనీలు అనుమతి కోసం డీసీజీఐకి, నిపుణుల కమిటీకి దరఖాస్తు చేసుకున్నాయని ఆయన చెప్పారు