భార్యా బిడ్డల హత్య: ప్రజా ప్రతినిధి ఆత్మహత్య
మంగళూరు: జీవితంపై విరక్తి చెందిన ప్రజా ప్రతినిధి భార్యా బిడ్డలను అతిదారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలో జరిగింది. ఒకే కుటుంబంలో అందరూ అంతం కావడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
బంట్వాళ సమీపంలో గ్రామ పంచాయితీ సభ్యుడు పద్మనాభ నాయక్ భార్య పుష్పావతి, కుమారుడు పృద్వీ (6), కుమార్తె పూర్వీ (4)తో కలిసి నివాసం ఉంటున్నాడు. పద్మనాభ నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి అన్యోన్యంగా ఉండేవాడు. ఈయనకు ఆ పరిసర ప్రాంతాలలో మంచిపేరు ఉంది.
బుధవారం ఉదయం అయినా పద్మనాభ నాయక్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఫాం హౌస్ నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూశారు. ఆ సందర్బంలో నలుగురు ఇంటిలో శవమై కనిపించారు.
పద్మనాభ నాయక్ కత్తితో తన భార్యా బిడ్డల గొంతులు కోసి హత్య చేసి తరువాత ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగు చూసింది. వెంటనే స్థానికులు పోలీసు అధికారులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పద్మనాభ నాయక్ తన భార్యా బిడ్డలను ఎందుకు హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడనేది కచ్చితంగా తెలియడం లేదని పోలీసు అధికారులు అన్నారు.
పద్మనాభ నాయక్ చాలకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, చికిత్స పొందుతున్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పద్మనాభ నాయక్ ఎలాంటి డెత్ నోట్ వ్రాయలేదని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.