పెళ్లి మండపంలో లవర్ తో జంప్, లక్షల డబ్బు ఖర్చు, అమ్మాయితో అదే ముహుర్తంలో గ్రాండ్ గా!
బెంగళూరు: పెద్దలు నిశ్చయించిన పెళ్లి ఇష్టంలేదని కల్యాణమండపం నుంచి వరుడు పారిపోయిన ఘటన కర్ణాటకలోని మండ్యలో జరిగింది. అయితే యువతి పెళ్లి నిలిచిపోకూడదని, లక్షల రూపాయల నగదు వృదా కారాదని నిర్ణయించిన పెద్దలు అదే ముహూర్తానికి మరో యువకుడితో పెళ్లి జరిపించారు.
మండ్య జిల్లా, మద్దూరు తాలుకా కే. శెట్టి హళ్ళిలో నివాసం ఉంటున్న అబిజిత్ ప్రైవేట్ మొబైల్ కంపెనీలో టవర్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీరంగపట్టణం తాలుకాకు చెందిన యువతితో అబిజిత్ పెళ్లి నిర్ణయించారు. మండ్యలోని బీజీఎస్ కమ్యూనిటీ హాల్ లో బుధవారం రాత్రి రిసెప్షన్, గురువారం ఉదయం ముహుర్తం నిర్ణించారు.
బుధవారం రిసెప్షన్ జరిగింది. రిసెప్షన్ కు అబిజిత్ హాజరై యువతి పక్కన సంతోషంగానే ఉన్నాడు. అయితే గురువారం వేకువ జామున అబిజిత్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు హడిలిపోయారు. ఎంత వెతికినా అబిజిత్ ఆచూకి చిక్కలేదు.
అబిజిత్ సొంత గ్రామానికి చెందిన యువతి మైసూరులో ప్యారామెడికల్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తోంది. కాలేజ్ అమ్మాయిని అబిజిత్ ప్రేమిస్తున్నాడని, ఆమెతో కలిసి వెళ్లిపోయాడని విచారణలో వెలుగు చూసింది. పెళ్లి ఆగిపోవడం ఇష్టం లేని పెద్దలు యువతి మేనమామతో అదే ముహుర్తానికి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి కుమారుడు పారిపోయినా యువతిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన యువకుడిని పలువురు అభినందిస్తున్నారు.