విషాదం: పేలిన గిఫ్ట్ బాంబు, కొత్త పెళ్లికొడుకు దుర్మరణం, పెళ్లికూతురి పరిస్థితి విషమం
Recommended Video

పట్నాగర్: ఒడిశాలోని బొలాంగిర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి వచ్చిన గిఫ్టులు విప్పి చూస్తుండగా ఓ గిఫ్టులోని బాంబు పేలింది. ఈ ఘటనలో కొత్త పెళ్లికొడుకు, అతడి నాయనమ్మ, పెళ్లికూతురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కొత్తపెళ్లికొడుకు అతడి నాయనమ్మ మరణించారు. మరోవైపు పెళ్లికూతురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే... బొలాంగిర్ జిల్లాలోని పట్నాగర్ బ్రహ్మపురాకు చెందిన సౌమ్య శేఖర్ సాహు, రీమా సాహులకు ఫిబ్రవరి 18న వివాహమైంది. అనంతరం వీరు ఫిబ్రవరి 21న రిసెప్షన్ ఇచ్చారు. ఆ సమయంలో నూతన వధూవరులకు అభినందనలు తెలిపేందుకు విచ్చేసిన అతిథులు పలు గిఫ్ట్లు అందజేశారు.

శుక్రవారం కొత్త పెళ్లికొడుకు సౌమ్య శేఖర్ సాహు, అతడి భార్య రీమా సాహు తమ వివాహం సందర్భంగా బంధుమిత్రులు అందజేసిన గిఫ్టులను విప్పి చూస్తున్నారు. ఓ గిఫ్టును విప్పగానే అందులోని బాంబు పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ఘటనలో సౌమ్యశేఖర్, రీమాలతోపాటు సౌమ్యశేఖర్ నాయనమ్మ కూడా తీవ్రంగా గాయపడ్డారు.
బంధవులు వారిని చికిత్స నిమిత్తం తొలుత పట్నాగర్లోని ఆసుపత్రికి, ఆ తరువాత బొలాంగిర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సౌమ్యశేఖర్ నాయనమ్మ మరణించింది. మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తపెళ్లికొడుకు సౌమ్యశేఖర్ను బర్లాలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మరోవైపు కొత్తపెళ్లికూతురు రీమా సాహు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications