పెళ్లికొడుకే పంతులైతే.. ట్విస్ట్ అదుర్స్ కదూ..!
హిందూ సంప్రదాయాల ప్రకారం సాధారణంగా పెళ్లిలో వధూవరులతో పాటు పురోహితుడు కూడా కచ్చితంగా ఉంటాడు. పూజారి మంత్రాలు చదువుతుంటే వధూవరులు ఇద్దరూ అందుకు తగ్గట్టుగా నడుచుకుంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. అక్కడ పెళ్లికొడుకే పూజారిగా మారి తన పెళ్లిలో తానే మంత్రాలు చదువుతూ అందర్నీ అబ్బుర పరిచాడు. వధూవరులు ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకుని అగ్నిగుండం చుట్టూ ఏడు అడుగులు నడిచారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఏంటి పెళ్లికొడుకే మంత్రాలు చదువు తున్నాడని ఆశ్చర్య పోయారు.
సహరన్పుర్ జిల్లాలోని రాంపుర్ మణిహరన్ పట్టణానికి చెందిన ప్రవీణ్ కుమార్ కుమారుడు వివేక్ కుమార్ ప్రస్తుతం గురుకుల్ కంగ్రీ యూనివర్సిటీలో బీఫార్మా చదువుతున్నాడు. వేదమంత్రాల మీద ఉన్న నమ్మకం, ప్రేమతో అవన్నీ నేర్చుకున్నాడు. అయితే వివేక్ కుమార్ పెళ్లి కుదిరింది. హరిద్వార్ జిల్లాలోని కుంజా బహదూర్పుర్ గ్రామ నివాసి అయిన అనిల్ కుమార్ కుమార్తెతో కొన్ని రోజుల క్రితం వివాహ సంబంధం నిశ్చయమైంది. ఇటీవల వివాహం జరిపించాలని నిర్ణయించుకోగా, వివేక్ కుమార్ ఊరేగింపుతో పెళ్లి మండపానికి వెళ్లాడు.

ఆ తర్వాత మండపంపై వివేక్ కుమార్ పెళ్లి మంత్రాలు చదవడం ప్రారంభించాడు. అది చూసిన బంధువులు, ఫ్రెండ్స్ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెళ్లిలో పూజారి ఉన్నాకూడా అన్ని మంత్రాలు వివేక్ కుమార్ జపిస్తూ ఉండటం చూసి అంతా కంగుతిన్నారు. వివేక్ మాత్రం మంత్రాలు జపిస్తూనే వధువుతో కలిసి అగ్ని గుండం చుట్టూ ఏడు అడుగులు నడిచాడు. మంత్రాల మధ్యే వధూవరులు ఇద్దరూ పూలదండలు కూడా మార్చుకున్నారు. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు వివేక్ కుమార్ ను తెగ పొగిడారు. వెల్ డన్ వివేక్ అంటూ కేరింతలు కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications