అత్తారింటికి దారేది: అక్కడంతా ఇల్లరికమే
కౌశాంబి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలుసు. సినిమాలో అత్త ఇంటికి అల్లుడు వెళ్లేది విడిపోయిన కుటుంబాన్ని కలపడానికి. అయితే ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాంతంలో అత్తారింటికి వెళితే ఇక జీవితాంతం అల్లుడు అక్కడే ఉండిపోవాలి. అది వారి సంప్రదాయం.
ఆడపిల్ల పుట్టిన తరువాత పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం భారతదేశ సంప్రాదాయం. అది ఆచారం, అయితే అక్కడక్కడ పెళ్లి చేసుకున్న అబ్బాయిలు అనేక కారణాల వలన ఇల్లరికం వెళుతుంటారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒక ప్రాంతంలో ఆడపిల్లలను అత్తారింటింకి పంపించరు.
అదివారి సంప్రదాయం. పెళ్లి అయిన తరువాత అల్లుళ్లే అన్ని సర్దుకుని నోరుమూసుకుని అత్తారింటిలో కాపురం చెయ్యాలి. అందుకు ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి నగరలోని కరాయ్ టౌన్ షిప్ ఉంది. ఇక్కడ అందరూ ముస్లీం సోదరులే నివాసం ఉంటారు.
35 సంవత్సరాల క్రితం ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన వీరు ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. గత 35 సంవత్సరాల నుండి ఇక్కడ పుట్టిన ఆడపిల్లలకు కాన్పూర్, పతేపూర్, ప్రతాప్ గడ్, అలహాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన అబ్బాయిలతో వివాహం చేశారు.
అప్పటి నుండి పెళ్లి చేసుకున్న మగాళ్లు వారి సొంత ఊర్లు వదిలి పెట్టి ఇక్కడికే వచ్చి ఇల్లరికం ఉంటున్నారని అక్కడ ఉన్న ‘హాజీ' అంటున్నారు. ఈ హాజీ కూడా అదే ప్రాంతంలో వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చారు. తన కుమార్తెకు వివాహం చేశానని, ఆమె భర్త పిల్లలతో కలిసి మాదగ్గరే నివాసం ఉంటున్నది అంటున్నారు.
ఈ ఆచారం చూసిన ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు కౌశాంబి నగరం అనే పేరు మరిచిపోయారు. ఆ ప్రాంతానికి అల్లుళ్ల వీధులు అని నామకరణం చేసేశారు. ఎవరైనా కొత్త వారు అక్కడికి వెళ్లాలంటే అల్లుళ్ల ప్రాంతం అని చెబితే స్థానికులకు అర్థం అవుంది. మొత్తం మీద అక్కడ ఉన్న ఆడపిల్లలకు అత్తారింటికి దారే తెలిదు.