సరిహద్దుల్లో కలకలం: కంచె దాటుకుని భారత భూభాగంపై అడుగుపెట్టిన పాక్ చొరబాటుదారుడు
అహ్మదాబాద్: గుజరాత్ సరిహద్దుల్లో బుధవారం మధ్యాహ్నం కలకలం చెలరేగింది. గుర్తు తెలియని చొరబాటుదారుడొకరు పాకిస్తాన్ సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపై అడుగుపెట్టాడు. కంచె దాటుకుని భారత భూభాగంలోకి సుమారు 50 మీటర్ల వరకు చొచ్చుకు వచ్చాడు.
అతణ్ని గమనించిన వెంటనే భారత సరిహద్దు భద్రతాదళం జవాన్లు అప్రమత్తమయ్యారు. వెంటనే అదుపులోకి తీసుకున్నారు. తాను పాకిస్తానీయుడినని అతను అంగీకరించినట్లు తెలుస్తోంది. అతని వద్ద ఎలాంటి పత్రాలు లేవు. అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ బలగాలు విచారిస్తున్నాయి.
గుజరాత్ లోని కఛ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చొరబాటుదారుడి వయస్సు 50 సంవత్సరాలు ఉంటుందని బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. కఛ్ సరిహద్దుల్లోని పిల్లర్ నంబర్ 1050 సమీపంలో అతణ్ని అదుపులోకి తీసుకున్నామని అన్నారు.
పాకిస్తాన్ కు చెందిన చొరబాటుదారులు సరిహద్దులను దాటుకుని భారత్ లోకి ప్రవేశించడం కొత్తేమీ కాదు. ఇటీవలి కాలంలో చొరబాట్లు తీవ్రం అయ్యాయి. కొద్దిరోజుల కిందటే పాకిస్తాన్ కు చెందిన షారూఖ్ అనే వ్యక్తిని పంజాబ్ లో సరిహద్దులు దాటుకుని భారత్ లో ప్రవేశించాడు. బీఎస్ఎఫ్ బలగాలు అతణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తన పేరు షారూఖ్ అని చెప్పాడు. ప్రస్తుతం అతను భద్రత బలగాల అదుపులో ఉన్నాడు.