మోదీ పిలుపును పట్టించుకోని గుజరాతీయులు - బీజేపీ పాలనపై ..!!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఉదయం 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. 1వ తేదీన ముగిసిన తొలి విడత తరహాలోనే ఇవ్వాళ కూడా గుజరాత్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీని ప్రభావం ఏ పార్టీ మీద ఉంటుందనేది 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో తేలిపోతుంది. గుజరాత్తో పాటు ఇప్పటికే పోలింగ్ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఓట్లను లెక్కిస్తారు.
గుజరాత్లో ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తోంది. తొలి విడతలో 19 జిల్లాల్లోని 89 స్థానాలకు గురువారం పోలింగ్ ఇదివరకే ముగిసింది. దక్షిణ గుజరాత్, కఛ్, సౌరాష్ట్ర రీజియన్లలోని జిల్లాలు ఇందులో ఉన్నాయి. మిగిలిన 93 స్థానాలకు ఇవ్వాళ పోలింగ్ ముగిసింది. సెంట్రల్, నార్త్ గుజరాత్లల్లో గల 14 జిల్లాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రెండో దశలో పోలింగ్ జరుగనున్న 93 స్థానాల్లో మొత్తం 833 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 69 మంది మహిళల, 285 మంది స్వతంత్ర్య అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ అన్నీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలిపారు. కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేసింది. మిగిలిన మూడింటిని తన మిత్రపక్షం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది. బహుజన్ సమాజ్ పార్టీ-44, భారతీయ ట్రైబల్ పార్టీ-12 చోట్ల అభ్యర్థులను బరిలో దింపింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 9 గంటలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ రణిప్ ప్రాంతంలో గల నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అంతకుముందు- ఆయన ఈ ఉదయం 8:40 నిమిషాలకు గాంధీనగర్లోని రాజ్భవన్ నుంచి అహ్మదాబాద్కు బయలుదేరి వచ్చారు. పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
ఉదయం 10:30 గంటల సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అహ్మదాబాద్లోనే ఓటు వేశారు. తన కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన సబ్ జోనల్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం సమీప ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అతిపెద్ద పడంగ అని, ఇందులో ప్రతి ఒక్క ఓటర్ భాగస్వామి కావాలని మోదీ- అమిత్ షా పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కు వల్ల ప్రజాస్వామ్యం బలోపేతమౌతుందని పేర్కొన్నారు. ఆ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదనేది పోలింగ్ శాతంతో స్పష్టమౌతోంది. తొలి విడత తరహాలోనే ఇప్పుడు కూడా సాయంత్రం 5 గంటల వరకు 58.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.