100 మందితో ఫస్ట్ లిస్ట్, సీఎం భూపేంద్ర పటేల్ ఇక్కడి నుంచే, పోటీకి దూరంగా డిప్యూటీ సీఎం
గుజరాత్లో మరోసారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ అనుకుంటోంది. అందుకోసం ముమ్మరంగా ప్రచారం కూడా నిర్వహిస్తోంది. తొలి విడత పోల్కు సంబంధించి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. 100 మందితో కూడిన జాబితాను కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ గురువారం ప్రకటించారు.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఈసారి కూడా ఘట్లొడియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు. మాజీ సీఎం విజయ్ రుపానీ, సీనియర్ నేత భూపేంద్ర సింగ్ చూడసమ మాత్రం పోటీ చేయరట. అంతేకాదు మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కూడా పోటీ చేయడం లేదట. ఇదీ మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. నితిన్ పటేట్ బరి నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు
తాను బరిలోకి దిగనని విజయ్ రుపానీ స్వయంగా ప్రకటన చేశారు. ఈ విషయాన్ని తాను పార్టీ హై కమాండ్కు తెలియజేశానని తెలిపారు. విజయ్ రుపానీ 2016 నుంచి 2021 వరకు సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరగనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన 89 నియోజకవర్గాలకు 5 వ తేదీన 93 నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుంది. డిసెబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికలో ఆరో సారి గెలిచి.. అధికారం చేపడుతామని బీజేపీ ధీమాతో ఉంది. గుజరాత్ పోల్పై ఆప్ కూడా ఆశలు పెట్టుకుంది. అధికారం చేపడుతామని అంటోంది.
కాంగ్రెస్ పార్టీ మాత్రం క్రమంగా తన ప్రభను కోల్పోతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. గుజరాత్ మీదుగా చేయడం లేదు. దీంతో పలు సందేహాలు వస్తున్నాయి. రాహుల్ మాత్రం.. అధ్యక్షుడు.. ఖర్గే అన్నీ చూసుకుంటారు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.