మోడీ ఎఫెక్ట్: గుజరాత్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మళ్లీ రిసార్ట్ కు, వదలం, ఓటు వేస్తేనే !
అహమ్మదాబాద్: రాజ్యసభ ఎన్నిక సందర్బంగా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దెబ్బకు హడలిపోయిన గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది శాసన సభ్యులు గత వారం రోజుల నుంచి బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ లో మకాం వేసిన విషయం తెలిసిందే.
ఆదివారం అర్ధరాత్రి 44 మంది కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు భారీ భద్రతతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. తరువాత ప్రత్యేక విమానంలో అహమ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు. సోమవారం వేకువ జామున 4.30 గంటలకు శాసన సభ్యులు అహమ్మదాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు.
అహమ్మదాబాద్ విమానాశ్రయంలో 44 మంది శాసన సభ్యులు దిగిన వెంటనే అందర్నీ నగర శివార్లలోని రిసార్ట్ కు తరలించారు. శాసన సభ్యులు ఎవ్వరినీ వారి ఇళ్లకు పంపించడానికి కాంగ్రెస్ నాయకులు అనుమతించలేదని తెలిసింది. మంగళవారం వరకు శాసన సభ్యులు ను అహమ్మదాబాద్ శివార్లలోని రిసార్ట్ లోనే బస చెయ్యాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశించిందని తెలిసింది.
బెంగళూరు నగర శివార్లలోని ఈగల్టన్ గాల్ఫ్ రిసార్ట్ లో ఆదివారం గుజరాత్ కాంగ్రెస్ శాసన సభ్యులను కర్ణాటక సాంప్రధాయం ప్రకారం మైసూరు పేట, గంధపు మాలలు వేసి ఘనంగా సన్మానించారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ గుజరాత్ శాసన సభ్యులను సన్మానించి వారితో ఫోటోకు ఫోజు ఇచ్చారు.
మంత్రి డీకే. శివకుమార్ స్వయంగా ఎమ్మెల్యేలు అందరినీ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకెళ్లి అహమ్మదాబాద్ పంపించారు. అహమ్మదాబాద్ శివార్లలోని రిసార్ట్ నుంచి మంగళవారం జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి శాసన సభ్యులను తీసుకెళ్లాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.