మరో అత్యాచారం కేసులో దోషిగా ఆశారాం బాపూ: జీవితఖైదు విధించిన కోర్టు
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ మరో అత్యాచారం కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ గుజరాత్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
గాంధీనగర్: వివాదాస్మద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ మరో అత్యాచారం కేసులో దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ గుజరాత్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. అయితే, ఇప్పటికే ఆశారాం బాపూ మరో రేప్ కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
2013లో గుజరాత్ మోతేరాలోని ఆశారాం బాపూ ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని సూరత్కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2001 నుంచి 2006 మధ్య ఆశారాం తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ చేపట్టిన గాంధీనగర్ సెషన్స్ కోర్టు.. ఆశారాంను దోషిగా తేల్చుతూ సోమవారం తీర్పు వెలువరించింది. సరైనా సాక్ష్యాధారాలు లేని కారణంగా ఆశారాం బాపూ భార్య సహా మిగిలిన ఆరుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. తాజాగా, మంగళవారం ఆశారాంకు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.
గతంలో జోధ్పూర్లోని ఆశ్రమంలో ఓ 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులోనూ దోషిగా తేలి జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నారు ఆశారాం బాపూ. 2018 నుంచి జోధ్పూర్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు.