బీజేపీ ఆశలు గల్లంతు, అందని ద్రాక్షే: కాంగ్రెస్కు 'అతిపెద్ద' ఊరట!
అహ్మదాబాద్: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు సస్పెన్స్గా మారింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు సరళిని చూస్తుంటే హిమాచల్ ప్రదేశ్ బీజేపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. గుజరాత్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ను కొట్టి పారేయలేని పరిస్థితి ఉంది.
Recommended Video
ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. తొలి నుంచి బీజేపీకి ఓ విధంగా పోటీనే ఇచ్చింది. తొమ్మిది గంటల సమయంలో బీజేపీ 85 స్థానాల్లో, కాంగ్రెస్ 73 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తానికి బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీనే ఇస్తోంది.
బీజేపీ టార్గెట్ 150 అందకపోవచ్చు
గుజరాత్ ఎన్నికల్లో ఈసారి 150 సీట్లు గెలవాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేసింది. కానీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుండటంతో అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. పరిస్థితి చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినట్లు బీజేపీ 100 నుంచి 120 మధ్య, కాంగ్రెస్ 60 నుంచి 80 మధ్య సీట్లు గెలిచేలా కనిపిస్తోంది.
ఠాకూర్ల ప్రాబల్యం ఉన్నచోట్ల దూసుకెళ్తోన్న బీజేపీ
ఈ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. సర్వేల అంచనాలకు తగినట్టుగానే బీజేపీ ఆధిక్యంలో ఉంది. మరోవైపు హిమాచల్ప్రదేశ్లోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో విజయంవైపు దూసుకుపోతోంది. ఠాకూర్ల ప్రాబల్యం ఉన్న చోట్ల బీజేపీ దూసుకెళ్తోంది.
ఈ ప్రాంతాల్లో బీజేపీదే హవా
కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అర్బన్ ఏరియాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సూరత్ ప్రాంతంలో పది స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. దక్షిణ, మధ్య గుజరాత్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా - నేనా అన్నట్లుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందుకు దూసుకెళ్తోంది.
కాంగ్రెస్కు ఊరట
ఓ వైపు కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో పూర్తిగా ఆశలు వదిలేసుకుంది. అదే సమయంలో గుజరాత్లో బీజేపీకి గట్టి పోటీని ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి కొంతలో కొంతలో ఊరట కలిగించే అంశం.