పాతికేళ్లలో ఒక్క హాస్పిటల్ కూడా కట్టలేదు: గుజరాత్ సర్కార్పై కాంగ్రెస్ ధ్వజం
దేశానికే రోల్ మోడల్ స్టేట్గా చెప్పుకునే గుజరాత్లో గత 25 ఏళ్లుగా ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా నిర్మాణం కాలేదనే నిజం తెలిస్తే షాక్ అవుతారు. అవును ఇది నిజం. గుజరాత్లో గత పాతికేళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క హాస్పిటల్ కూడా అక్కడ నిర్మించలేదని కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఆరోగ్యపరమైన విధానాలపై విమర్శలు ఎక్కుబెట్టారు కాంగ్రెస్ నేత రాజీవ్ సతావ్. ఇక ఈ పాతికేళ్లలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు పనిచేశారు.
2014లో దేశాన్ని గుజరాత్ మోడల్లా తీర్చి దిద్దుతానని ప్రధాని మోడీ చెప్పారని అది నిజం చేశారని అయితే పబ్లిసిటీలో మాత్రమే చేసి చూపించారని వ్యంగాస్త్రాలు సంధించారు రాజీవ్ సతావ్. కాంగ్రెస్ హయాంలో ఎన్నో పెద్ద హాస్పిటల్స్ నిర్మితమయ్యాయని మరో కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శక్తిసిన్హ్ గోహిల్ చెప్పారు. గత ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజ్కోట్లో ఎయిమ్స్ నిర్మిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేసిన శక్తిసిన్హ్ గోహిల్... ప్రధాని మోడీ గతేడాది డిసెంబరులో శంకుస్థాపన చేశారని అది నిర్మాణ దశలోనే ఉందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేదని చెప్పారు.
ఆరోగ్య రంగంలో గుజరాత్కు మంచి వనరులు ఉన్నాయని చెప్పిన ఆయన... అహ్మదాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్గా రికార్డులకు ఎక్కిందని చెప్పారు. పేషెంట్లకు 149 ప్రాణాదార మెడిసిన్స్ తమ హయాంలో ఇచ్చేవారమని వెల్లడించారు. అయితే 2001 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ఆరోగ్యపరమైన విధానాలకు తూట్లు పొడిచి ప్రైవేట్ హాస్పిటల్స్ను రాష్ట్రంలో ప్రోత్సహించారని విమర్శలు సంధించారు. ఇక ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో కరోనా పరిస్థితి మరింత అద్వానంగా ఉందని చెప్పారు. సరిపడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం గుజరాత్ రాష్ట్రంకు ఉంది కానీ ప్రస్తుత పాలకుల నిర్ణయాల వల్ల ఈ రోజు ఆక్సిజన్ కొరత ఏర్పడిందని మండిపడ్డారు. ఇక 16 జిల్లా హాస్పిటల్స్లో మాత్రమే సీటీ స్కాన్లు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించిందని గుర్తుచేశారు.
33 జిల్లాలున్న గుజరాత్లో ఒక్క జిల్లా హాస్పిటల్లో మాత్రమే ఎంఆర్ఐ మెషీన్ ఉందని చెప్పారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏడు జిల్లాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్లో పడకలు లేవని గతవారం హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని కాంగ్రెస్ గుర్తు చేసింది.అంతేకాదు బీజేపీ నాయకులు రెమ్డెసివిర్ స్టాక్ను అక్రమంగా నిల్వచేస్తున్నారని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రతిపక్షనేత పరేష్ ధనాని. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ కుదేలైందని మండిపడ్డారు గుజరాత్ పీసీసీ చీఫ్ అమిత్ చావ్డా. కోవిడ్తో మృతి చెందిన వారి అంత్యక్రియల కోసం 5 నుంచి 6 గంటల సమయం వరకు వేచిచూడాల్సి వస్తోందని, అడ్మిట్ చేసేందుకు పడకలు ఖాళీ లేవని, ఆక్సిజన్ లేదని మండిపడ్డారు. ప్రభుత్వం అసలు లెక్కలను దాస్తోందని మరోవైపు ప్రైవేట్ హాస్పిటల్స్ పేషెంట్స్ను దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.