కోర్టును ఆశ్రయించిన రేప్ బాధితురాలు: గర్భస్రావానికి నిరాకరణ
అహ్మదాబాద్: ఏడుగురు దుర్మార్గుల బారినపడి అత్యాచారానికి గురై గర్భందాల్చిన ఓ మహిళ తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతివ్వాలని గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త ఆ బిడ్డను కనేందుకు అంగీకరించడం లేదని తెలిపింది.
కాగా, వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జె బి పర్దివాలా ఆమె పిటిషన్ను తిరస్కరించారు. 20వారాల తర్వాత గర్భం తొలగించడం తల్లి ప్రాణానికి ప్రమాదమని, అందుకోసం న్యాయస్థానం గర్భస్రావానికి అనుమతించదని తీర్పు చెప్పింది.
20 వారాలకు మించి ఉన్న గర్భాన్ని తొలగించడానికి చట్టం అనుమతించదని పేర్కొంది. గర్భిణి శిశువుకు జన్మనిచ్చే వరకు ప్రభుత్వం తరపున ఎన్జీవోల సాయంతో ఆమె బాగోగులు చూసుకోవాలని బోటడ్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.
‘యువతి ధైర్యంగా ముందుకెళ్లాలి. శిశువుకు జన్మనీయాల్సిందే. ఆమె భవిష్యత్లో ఎన్ని అపవాదులు ఎదుర్కొవాల్సి వస్తుందో కోర్టుకు తెలుసు. అయినా తప్పడం లేదు' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
బాధిత మహిళ రేపిస్టుల నిర్బంధంలో ఆరు నెలలపాటు ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బోటడ్ జిల్లాకు చెందిన ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు సూరత్లో నివసిస్తున్నారు.