వింత కేసు : దెయ్యాలపై కేసు నమోదు చేసిన పోలీసులు... వేధిస్తున్నాయని యువకుడి ఫిర్యాదు
గుజరాత్లో ఓ వింత కేసు నమోదైంది. ఓ వ్యక్తి తనను దెయ్యాల గుంపు వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు,ఆ గుంపులోని రెండు దెయ్యాలు తనను చంపుతామని బెదిరిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు ఆ రెండు దెయ్యాలపై కేసు నమోదు చేశారు. నిజానికి ఆ ఫిర్యాదు చేసిన వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదు. అయితే కేసు నమోదు చేశామని చెప్పడం ద్వారా పోలీసులు అతని మానసిక ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేశారు.
అసలేం జరిగింది...
గుజరాత్లోని పంచమహల్ జిల్లా జంబుఘోడ తాలుకాకి చెందిన వర్సంగ్ భాయ్ బరియా(35) అనే వ్యక్తి ఇటీవల కంగారుగా స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తనకు ఓ దెయ్యాల గుంపు ఎదురైందని... అందులో రెండు దెయ్యాలు తనను చంపుతామని బెదిరిస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను పొలంలో పనిచేస్తుండగా ఆ దెయ్యాల గుంపు తన వద్దకు వచ్చిందన్నాడు. దయచేసి ఆ దెయ్యాల బారి నుంచి తనను కాపాడాలని కోరాడు. అతని మాటలు విని పోలీసులు మొదట షాక్ తిన్నారు. అతన్ని పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు
నర్సంగ్ భాయ్ సోదరుడు మహేష్ బరియా ఫోన్లో పోలీసులతో మాట్లాడారు. నర్సంగ్ కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. ఏడాది కాలంగా అతనికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ జరుగుతోందని... అయితే గత 10 రోజులుగా అతను మందులు వేసుకోవట్లేదని తెలిపారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు అతని రూట్నే అనుసరించారు. నర్సంగ్ ఫిర్యాదు మేరకు రెండు దెయ్యాలపై కేసు నమోదు చేశామని అతనితో చెప్పారు. ఎఫ్ఐఆర్ను కూడా అతనికి చూపించారు. పోలీస్ స్టేషన్ అయితే దెయ్యాలు రావన్న ఉద్దేశంతో అతను తమ వద్దకు వచ్చాడని... అతని మానసిక ఆందోళనను తగ్గించేందుకే దెయ్యాలపై కేసు నమోదు చేసినట్లు చెప్పామని పోలీసులు తెలిపారు.
ఇటీవల బిహార్లోనూ ఇదే తరహా కేసు...
నర్సంగ్ మందులు వాడేలా చూసుకోవాలని పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సూచించారు. ఇటీవల బిహార్లోనూ ఇలాంటిదే ఓ వింత కేసు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఓ మాంత్రికుడు కలలో వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. కుమారుడి ఆరోగ్యం బాగోలేదని మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లానని.. ఆ సమయంలో అతనో మంత్రం చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. నిత్యం ఆ మంత్రాన్ని కుమారుడి ముందు పఠించమని చెప్పాడని... అతను చెప్పినట్లే చేసినప్పటికీ కుమారుడి ప్రాణాలు దక్కలేదని వాపోయింది. దీనిపై మాంత్రికుడిని నిలదీస్తే తనపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపించింది. ఆ సమయంలో తన కుమారుడి ఆత్మ వచ్చి కాపాడిందని చెప్పింది. ఆ తర్వాత నుంచి మాంత్రికుడు తన కలలో వచ్చి అత్యాచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అతని నుంచి తనను కాపాడాలని విజ్ఞప్తి చేసింది.