gujarat polls : గుజరాత్ లో ఆప్ ఖాతా తెరవకపోవచ్చు ! అమిత్ షా జోస్యం
గుజరాత్ లో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్, ఆప్ కూడా బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ముక్కోణపు పోరు సాగుతోంది. ఈ పోరులో బీజేపీ మరోసారి విజయం సాధించడం ఖాయమని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. దీంతో వచ్చిన ధీమానో, మరే ఇతర ఉద్దేశమో కానీ ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కీలక జోస్యం చెప్పారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఖాతా తెరవకపోవచ్చని అమిత్ షా ఇవాళ జోస్యం చెప్పారు. రేపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఆప్ అధినేత కేజ్రివాల్ రాష్ట్రంలో పర్యటిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆప్ ను గెలిపిస్తే ఢిల్లీ, పంజాబ్ ల తరహాలో గుజరాత్ లోనూ పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగానే కనిపిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన అభివృద్ధి, జీరో బుజ్జగింపు విధానాన్ని అమలు చేయడం వల్లే గత 27గా బీజేపీపై ప్రజలు పదే పదే విశ్వాసం ఉంచుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా వెల్లడించారు.
అలాగే గుజరాత్ లో ఆప్ ఎంట్రీపై అడిగిన ప్రశ్నకు జవాబుగా.. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా పోటీ చేసే అవకాశం ఉంటుందని, అయితే ప్రజలు వారిని ఆదరించారా లేక తిరస్కరించారా అన్నది ముఖ్యమన్నారు. అలాగే గుజరాత్ ప్రజల మనస్సుల్లో ఆప్ లేదన్నారు. ఫలితాలు వచ్చాక చూడాలని, గెలిచిన అభ్యర్ధుల జాబితాలో ఆప్ ఉండదని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.