Cvoter-ABP opinion Poll : గుజరాత్ లో మళ్లీ కమల వికాసం ? మరిన్ని సీట్లతో-తాజా సర్వే
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్, ఆప్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొందన్న వార్తల నేపథ్యంలో తాజాగా వెలువడిన ఓ ఒపీనియన్ పోల్ విజేత ఎవరో తేల్చేసింది. గుజరాత్ లో మరోసారి బీజేపీయే విజయం సాధిస్తుందని, అందరి అంచనాలను మించి కాషాయ పార్టీ సీట్లు కూడా గెల్చుకోవడం ఖాయమని ఆ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.
ప్రముఖ సర్వే సంస్ధ సీఓటర్-జాతీయ న్యూస్ నెట్ వర్క్ ఏబీపీతో కలిసి చేసిన ఒపీనియన్ పోల్ లో అధికార బీజేపీ మరోసారి గెలవబోతున్నట్లు తేలింది. అంతే కాదు బీజేపీకి ప్రస్తుతం ఉన్న 99సీట్లతో పోలిస్తే ఈసారి 131 నుంచి 139 సీట్లు లభించబోతున్నట్లు ఈ సర్వే తెలిపింది. పాపులర్ ఓటు ఆధారంగా చేపట్టిన అధ్యయనంలో ఈ మేరకు ఫలితాలు వచ్చినట్లు సర్వే సంస్ధ తెలిపింది.

2017 ఎన్నికల్లో 77 సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్ కు ఈసారి కేవలం 31 నుంచి 39 సీట్లు మాత్రమే లభించబోతున్నట్లు సీఓటర్ వెల్లడించింది. ఈ సర్వేలో ఆశ్చర్యకరంగా బీజేపీకి గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 7 నుంచి 15 సీట్లు మాత్రమే లభించబోతున్నట్లు తేలింది.
ఈ సర్వేను బీజేపీ వాస్తవ పరిస్ధితులకు దగ్గరగా ఉందని స్వాగతించింది.అయితే విపక్ష కాంగ్రెస్, ఆప్ మాత్రం ఈ సర్వే ఫలితాలను తప్పుబట్టాయి. గతంలో సర్వే సంస్ధల అభిప్రాయ సేకరణలు చాలా సార్లు తప్పని తేలాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బీజేపీ ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకే ఆప్, ఎంఐఎం పార్టీల్ని తోడు తెచ్చుకుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఆప్ కూడా ఇలాంటి సర్వేలు చాలా సార్లు తప్పని తేలాయని, గుజరాత్ లో ప్రజలు ఇప్పటికే బీజేపీ ప్రభుత్వాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించింది.












Click it and Unblock the Notifications