Gujatat Assembly Elections 2022 : ఆ రేసులో బీజేపీ, కాంగ్రెస్ ను వెనక్కి నెట్టిన ఆప్ !
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అధికార బీజేపీ మరోసారి గెలిచేందుకు సర్వశక్తులొడ్డుతండగా.. ఆ పార్టీని ఎలాగైనా అడ్డుకునేందుకు విపక్ష కాంగ్రెస్, ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం గట్టి అభ్యర్ధుల్ని బరిలోకి దింపుతున్నాయి. వీరిలో కొందరు క్రిమినల్ చరిత్ర కలిగిన వారున్నా లెక్క చేయడం లేదు.
గుజరాత్ లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో డిసెంబర్ 1న జరిగే తొలి విడతలో 89 స్ధానాల్లో, డిసెంబర్ 5 జరిగే రెండో విడతలో 93 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలి విడత 89 సీట్లలో పోటీ చేస్తున్న 788 అభ్యర్ధుల్లో 170 మంది వరకూ నేరచరితులు ఉన్నారు. వీరంతా క్రిమినల్ నేర చరిత కలిగిన వారే. వీరిలో 100 మందిపై రేప్, హత్య వంటి అతి తీవ్ర నేరాలు కూడా నమోదై ఉన్నాయి. ఈ వివరాల్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్స్మ్ ప్రకటించింది.
తొలివిడతలో 89 సీట్లకు గానూ 88 సీట్లలో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధులు ఎక్కువగా క్రిమినల్ నేరచరిత్ర కలిగిన వారు ఉన్నారు. ఇందులో ఏకంగా 30 శాతం మంది హత్య, రేప్, దౌర్జన్యం, కిడ్నాప్ లు చేసిన చరిత్ర కలిగిన వారేనని ఏడీఆర్ తెలిపింది. ఆ తర్వాత స్ధానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. 89 సీట్లలో పోటీ చేస్తుండగా.. వీరిలో 20 శాతం మంది అభ్యర్ధులకు క్రిమినల్ నేర చరిత్ర ఉంది. అలాగే అధికార బీజేపీ సైతం అన్ని సీట్లలో పోటీ చేస్తుండగా.. వీరిలో 12 శాతం మంది క్రిమినల్ నేర చరితులున్నారు. దీంతో ఈ రేసులో ఆప్ టాప్ లో నిలిచింది.
మరోవైపు 2017లో గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తొలిదశలో అన్ని పార్టీలు కలిపి 15 శాతం మంది అభ్యర్ధులు మాత్రమే నేరచరితులున్నారు. వీరిలో 8 శాతం మంది తీవ్ర నేర చరితులున్నారు. కానీ ఈసారి మాత్రం తొలిదశలో 21 శాతం నేరచరితులు బరిలో ఉన్నట్లు తేలింది. వీరిలో 13 శాతం మంతి తీవ్రమైన నేర చరిత కలిగిన వారు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్స్మ్ ప్రకటించింది.