అహ్మదాబాద్లో మరణ మృదంగం : హాస్పిటల్ లో మూడు రోజుల్లో 18 మృతులు
అహ్మదాబాద్: అహ్మదాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో 24 గంటల వ్యవధిలో తొమ్మిది మంది నవజాత శిశువులు మృతిచెందారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి దవాఖానలోని శిశువిభాగంలో వరుసగా పిల్లలు మృతిచెందడం కలకలం రేపింది. మూడురోజుల వ్యవధిలో ఏకంగా 18 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని దవాఖాన వర్గాలు తెలిపాయి. ఈ మరణాలకు దారితీసిన పరిస్థితులపై గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. మృతిచెందిన శిశువుల్లో ఐదుగురు కనీస సగటు బరువు కన్నా తక్కువగా ఉన్నవారే. వారు 700 -1000 గ్రాముల మధ్య బరువు మాత్రమే కలిగి ఉన్నారు.
దీపావళి సెలవుల కారణంగా ఆ పసిబిడ్డల్ని లూనావాడ, మాన్సా, విరామ్గావ్, హిమ్మత్నగర్, సురేందర్నగర్ ప్రాంతాల నుంచి అహ్మద్నగర్ సివిల్ దవాఖానకు తీసుకొచ్చారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఇంక్యుబేటర్ల కారణంగా వారు చనిపోలేదని, వైద్యపరంగా వీటిని సహజ మరణాలుగానే భావిస్తారు అని దవాఖాన సూపరింటెండెంట్ ఎం ఎం ప్రభాకర్ తెలిపారు.
దోషులపై కఠిన చర్యలు తప్పవని విజయ్ రూపానీ హెచ్చరిక
వాస్తవంగా అహ్మదాబాద్ సివిల్ దవాఖానాలో సగటున రోజుకు ఐదు, ఆరు నవజాత శిశువులు మరణిస్తారని మీడియాలో వార్తలొచ్చాయి. దవాఖానలోనే జన్మించిన నలుగురు మాత్రం ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్నవారేనని, పరిస్థితి విషమించడంవల్లే వారు చనిపోయారని సూపరింటెండెంట్ ఎం ఎం ప్రభాకర్ చెప్పారు. సరైన వసతులు లేవని ఫిర్యాదులు అందాయి. అయితే వసతుల కల్పనలో నిర్లక్షంగా వ్యవహరించిన అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని సీఎం విజయ్ రూపానీ స్పష్టం చేశారు.
అహ్మదాబాద్లో ఒకేరోజు తొమ్మిది మంది మ్రుతి మొదటిసారి
అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు వైద్యవిద్యా విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఆర్కే దీక్షిత్ నేతృత్వంలోని బృందాన్ని ప్రభుత్వం అహ్మదాబాద్ పంపింది. దవాఖానలో గడిచిన కొన్నేండ్లలో ఒకేరోజు తొమ్మిది మంది శిశువులు చనిపోవడం ఇదే తొలిసారి అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనుయా చౌహాన్ తెలిపారు.
ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటుందా?
డిసెంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గుజరాత్లో ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని అహ్మదాబాద్ దవాఖాన దుస్థితి తెలియజేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. భారీగా నవజాత శిశువులు మరణించడంతో ఆరోగ్య రంగంలో వసతుల కల్పనపై బీజేపీ ప్రభుత్వం చెప్తున్నదానికి, వాస్తవ పరిస్తితులకు భిన్నమైన వాతావరణం నెలకొన్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి వ్యాఖ్యానించారు. దవాఖానలో చికిత్స పొందుతున్న తమ పిల్లల పరిస్థితిపై పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ వైఖరే పిల్లల మరణాలకు కారణమైందని కాంగ్రెస్ కార్యకర్తలు దవాఖాన వద్ద ఆందోళనకు దిగారు. తక్షణం సీఎం విజయ్ రూపానీ, ఆరోగ్య మంత్రి శంకర్ చౌదరి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
సూపరింటెండెంట్ను
సూపరింటెండెంట్ను ఘెరావ్ చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా, శిశుమరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్రూపానీ ఆదివారం గాంధీనగర్లో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కాగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న పిల్లల మరణాలకు ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గుజరాత్, యూపీ సీఎంలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత జయవీర్ షేర్గిల్ డిమాండ్ చేశారు.