ప్రధాని మోడీతో ఢీ: అఖిలపక్ష భేటీకి కాశ్మీరీ నేతలు రెడీ: అక్కడే ఫైనల్
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతంగా రూపుదిద్దుకున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభత్వం చేస్తోన్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించ దలిచిన అఖిలపక్ష సమావేశానికి గుప్కర్ అలయన్స్ నేతలు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అనే డైలమాలో ఉన్న వారంతా సానుకూల వైఖరిని ప్రదర్శించారు. దేశ రాజధానిలో ప్రధాని నిర్వహించబోయే అఖిల పక్ష భేటీకి హాజరు కావాలని తీర్మానించుకున్నారు.
White Paper: జనం ప్రాణాలను కాపాడే శక్తి మోడీ కన్నీళ్లకు లేదు: థర్డ్వేవ్ ఒక్కటే కాదు: రాహుల్
పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (PAGD) పేరుతో ఈ కూటమి ఏర్పాటైంది. ఇందులో మొత్తం ఆరు పార్టీలు ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం, జమ్మూ కాశ్మీర్ ఆవామీ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకాశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్, కాంగ్రెస్ కూటమిగా ఏర్పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఇందులో కీలక పాత్రను పోషిస్తోన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై తొలి అడుగులో భాగంగా గురువారం ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంపై ఇన్నాళ్లూ కొంత ఊగిసలాటలో కనిపించారా నాయకులు. తాజాగా- దానికి హాజరు కావాలని తీర్మానించుకున్నారు. ఈ భేటీ సందర్భంగా ప్రధాని ఎదుటే తమ వైఖరిని స్పష్టం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ గుప్కర్ అలయెన్స్తో సంబంధం లేని ఇతర పార్టీలు కూడా ఈ భేటీకి హాజరు కానున్నాయి. అఖిలపక్ష సమావేశం అజెండా ఏమిటో ఇంకా తమకు స్పష్టం తెలియదని, అయినప్పటికీ- ఆల్ పార్టీ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు గుప్కర్ అలయెన్స్ కన్వీనర్, సీపీఎం నేత మహ్మద్ యూసుఫ్ తరిగామి తెలిపారు.
ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్థిస్తోన్నామని పీపుల్స్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి అద్నాన్ అష్రఫ్ మిర్ అన్నారు. ఈ భేటీని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇదివరకు ఈ పార్టీ కూడా గుప్కర్ అలయెన్స్లో కొనసాగింది. ఆ తరువాత విభేదాలు తలెత్తడంతో కూటమి నుంచి బయటికి వచ్చింది. కాగా- ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీతో పాటు ప్రధాని అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యే వారిలో గులాం నబీ ఆజాద్, తారాచంద్, ముజప్ఫర్ హుస్సేన్ బేగ్, నిర్మల్ సింగ్, కవీందర్ గుప్తా, రవీందర్ రైనా, భీమ్సింగ్ మహ్మద్ యూసుఫ్ తరిగామి, అల్తాఫ్ బుఖారి, సజ్జద్ లోన్ వంటి కీలక నేతలు ఉన్నారు.