పట్టేశారు: హనీ ప్రీత్ సింగ్ ఆచూకీ లభ్యం, వేషం మార్చి.. ఖాట్మాండూలో, కరెక్ట్ లొకేషన్ గుర్తింపు..
డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సహచరి, దత్తపుత్రిక అయిన హనీప్రీత్ ఇన్సాన్ ఆచూకీ నేపాల్ లో లభించింది.
న్యూఢిల్లీ: డేరాబాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ సహచరి, దత్తపుత్రిక అయిన హనీప్రీత్ ఇన్సాన్ ఆచూకీ నేపాల్ లో లభించింది. డేరాబాబాకు జైలుశిక్ష పడగానే హనీప్రీత్ పరారైన సంగతి తెలిసిందే. అప్పట్నించి ఆమె ఆచూకీ కోసం హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు విభాగాలు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ కేసులో హర్యానా ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) విభాగం రాజస్థాన్ లో డేరా బాబా సన్నిహితుడైన ప్రదీప్ గోయల్ ను అదుపులోకి తీసుకుని, విచారణ ప్రారంభించింది. దీంతో హనీ ప్రీత్ గుట్టువీడింది. ఆమె నేపాల్ కు పారిపోయిందని తేలింది.
ఖాట్మండూలో హనీప్రీత్ సంచారం...
దీంతో సిట్ అధికారులు నేపాల్ లోని తమ సోర్స్ తో కనెక్ట్ అయి, హనీప్రీత్ సింగ్ ఇన్సాన్ ఫోటోలు అక్కడికి పంపారు. వెంటనే రంగంలోకి దిగిన సోర్స్.. ఆమె ఆచూకీని గుర్తించినట్టు తేలింది. సెప్టెంబర్ 2న నేపాల్ రాజధాని ఖాట్మాండూలో హనీప్రీత్ కనిపించిందని నిర్ధారణ అయింది. ఆమెతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, వారంతా ఆమెను సురక్షిత ప్రాంతంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది.
గెటప్ మార్చి... నిఘా వర్గాలకు చిక్కకుండా...
పోలీసు, నిఘా వర్గాలు తనను గుర్తించకుండా ఉండేందుకు హనీ ప్రీత్ తన గెటప్ ను పూర్తిగా మార్చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె తన ప్రయాణాలను గతంలో మాదిరిగా లగ్జరీ వాహనాల ద్వారా కాకుండా సాధారణ, ప్రైవేటు ట్యాక్సీలలో చేస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆమెను పట్టుకునేందుకు పోలీసులు పకడ్బందీ ప్లాన్ తో రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.
కరెక్ట్ లొకేషన్ పట్టేశారు...
హనీప్రీత్ ఇన్సాన్ కరెక్ట్ లొకేషన్ ను హర్యానా సిట్ అధికారులు పట్టేశారు. సెప్టెంబర్ 2న నేపాల్ లోని ఖాట్మాండూ సమీపంలో ఆమె కనిపించిందని గుర్తించిన సిట్ అధికారులు, దానిని నిర్ధారించుకునేందుకు కొన్ని రోజులు వేచి చూసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నేపాల్ లోని ధరన్ ఇటహరి ప్రాంతంలో హనీప్రీత్ తలదాచుకున్నట్టు సమాచారం అందింది. దీంతో ఆమెను అదుపులోనికి తీసుకుని భారత్ కు తీసుకురావడమే మిగిలి ఉందని తెలుస్తోంది.
హనీప్రీత్, ఆదిత్య.. ఇద్దరూ ఒకేచోట?
గుర్మీత్ కు శిక్ష విధించిన సందర్భంగా హర్యానా, పంజాబ్ లలో చెలరేగిన అల్లర్ల వెనుక హనీప్రీత్ తో పాటు గుర్మీత్ ప్రధాన అనుచరుడు ఆదిత్య హస్తం కూడా ఉన్నట్లు హర్యానా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఒకే చోట ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే నేపాల్ నుంచి వారిని తీసుకురానున్నట్టు సమాచారం. నేపాల్ లో కూడా డేరా బాబాకు భక్తులు ఉన్నారు. నేపాల్ భూకంపం సంభవించిన సమయంలో గుర్మీత్ అక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆ సమయంలో బాధితులను ఆదుకున్నారని, తరువాత అక్కడ కూడా ఆశ్రమం ఏర్పాటు చేశారని, అందులో కూడా తమవైన భక్తి కార్యక్రమాలు జరిగేవని తెలుస్తోంది.