ఏం కష్టమొచ్చిందో: భార్యా పిల్లలను చంపి ఆ పై తాను కూడా ఆత్మహత్య చేసుకున్న డాక్టర్
గురుగ్రామ్ : గురుగ్రామ్లో దారుణం చోటుచేసుకుంది. ఓ డాక్టరు తన భార్యా పిల్లలను చంపి ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సెక్టార్ 49 ఉప్పల్ సౌత్ఎండ్లోని డాక్టర్ నివాసంలో జరిగింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి డాక్టర్ కుటుంబ సభ్యులు బయట కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంకు చేరుకున్న పోలీసులు ఇంటిలోకి ప్రవేశించగా అంతా రక్తపుమడుగులో పడిఉన్నారు.
ప్రాథమిక విచారణ ప్రకారం ప్రకాష్ సింగ్ (55 )తన భార్య సోను సింగ్ (50) కూతురు అదితి (22) కొడుకు ఆదిత్య (13)లు గాఢ నిద్రలో ఉండగా వారిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత ప్రకాష్ సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ప్రకాష్ పీహెచ్డీ చేశాడు. హైదరాబాద్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గత ఎనిమిదేళ్లుగా గురుగ్రామ్లో నివాసం ఉంటున్నాడు. అయితే అతని స్వస్థలం ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిగా పోలీసులు గుర్తించారు. గురుగ్రామ్లో తన భార్య సోను సింగ్ ఒక స్కూలును నడుపుతోంది. ఇక మృతి చెందిన కుటుంబ సభ్యులందరి గొంతులు కోసేసి ఉన్నాయని ఒక్క ప్రకాష్ సింగ్ శరీరం మాత్రంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు.
ఇక ఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన కుటుంబాన్ని పోషించుకోలేక పోతున్నట్లు ఆ సూసైడ్ నోట్లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఇక హ్యాండ్రైటింగ్ నిపుణుల సహకారంతో సూసైడ్ నోట్ను పరిశీలిస్తున్నామని అది డాక్టర్ రాశాడా లేక మరెవరైనా రాశారా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.