H1N1: వణికిపోతున్న రాజధాని, కొత్త వేరియంట్ వచ్చిందా?
దేశ రాజధాని ఢిల్లీలో స్వైన్ ఫ్లూ - హెచ్1ఎన్1 (H1N1) ఇన్ఫ్లుయెంజా కేసులు వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు నగరంలో ఏకంగా 1,777 హెచ్1ఎన్1 కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ వైరస్పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇది కొత్తగా రూపాంతరం చెందిన వైరస్ కాదని, కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
గత ఏడాది కాలంగా దేశంలో చలామణిలో ఉన్న 'A/Missouri/11/2025' రకానికి చెందిన హెచ్1ఎన్1 వైరస్ సబ్టైప్ మాత్రమే ప్రస్తుతం వ్యాపిస్తోందని ఐసీఎమ్ఆర్ పరిశోధకులు వెల్లడించారు. ఈ వైరస్ వ్యాప్తి పెరగడంతో ఏదైనా కొత్త వేరియంట్ వచ్చిందేమోనన్న అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, వైద్య నిపుణులు వాటిని పటాపంచలు చేశారు. ఉత్తరార్ధగోళంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్ఫ్లుయెంజా టీకాలు ఈ సబ్టైప్పై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని, కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వారికి రక్షణ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

గతేడాదితో పోలిస్తే మారిన వైరస్ సరళి
ఈ సంవత్సరం ఢిల్లీలో నమోదైన మొత్తం 2,602 సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసుల్లో సింహభాగం హెచ్1ఎన్1 రకానివే కావడం గమనార్హం. గత ఏడాది (2025) H3N2 రకం ఇన్ఫ్లుయెంజా కేసులు ఎక్కువగా నమోదు కాగా, ఈసారి H1N1 ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు దీని ప్రధాన లక్షణాలు. చాలామందిలో ఈ లక్షణాలు విశ్రాంతి , సాధారణ వైద్యంతో నయమవుతాయి. అయితే చిన్నారులు, వృద్ధులు, , ఇతర తీవ్రమైన ఆ అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
సరిహద్దుల్లో నిఘా: హెల్త్ అలర్ట్ జారీ
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం నిఘాను తీవ్రతరం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, విద్యాశాఖ, కంటోన్మెంట్ బోర్డులతో ఆరోగ్య శాఖ కార్యదర్శి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రులలో ముందస్తు తనిఖీలు, పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. భారత్లో సాధారణంగా జనవరి-మార్చి మధ్య ఒకసారి, వర్షాకాలం పూర్తయ్యాక మరోసారి ఈ సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు పెరుగుతుంటాయి. మాస్కులు ధరించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం, జనసమ్మర్ద ప్రాంతాలకు దూరంగా ఉండటం ద్వారా ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని అధికారులు సూచించారు.














Click it and Unblock the Notifications