అలా జరుగుతోందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు : జేఎన్యూ విద్యార్థి నాయకురాలు ఐషే ఘోష్
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మూక జరిపిన దాడిలో విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం సోమవారం ఉదయం ఆమె డిశ్చార్జి అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దాడి జరగడానికి కొన్ని గంటల ముందు క్యాంపస్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్క చోట చేరారని,దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఘోష్ ఆరోపించారు.
జేఎన్యూ హింసాకాండ : మూక దాడిపై ప్రత్యక్షసాక్షులు ఏమంటున్నారు..
'మధ్యాహ్నం 2.30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్లోకి ప్రవేశించారు. ఏదో జరగబోతుందని అనుమానం కలిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. అయినా వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు' అని ఘోష్ తెలిపారు. సాయంత్రం సమయంలో జేఎన్యూ టీచర్స్ అసోసియేషన్ శాంతియుతంగా నిరసన తెలియజేస్తుండగా.. సబర్మతీ హాస్టల్ వద్ద ముసుగులు ధరించి వచ్చిన ఆ మూక ఒక్కసారిగా దాడికి పాల్పడినట్టు చెప్పారు. ఐరన్ రాడ్తో తన తలపై దాడి చేశారని,తీవ్ర రక్త స్రావం జరిగిందని వాపోయారు. అనంతరం ఆమెను అంబులెన్స్లో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం సోమవారం ఉదయం ఆమెను డిశ్చార్జి చేశారు.
జేఎన్యూలో మూక దాడిపై వామపక్ష,ఏబీవీపీ విద్యార్థి సంఘాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తున్నవారే క్యాంపస్లో హింసకు పాల్పడ్డారని జేఎన్యూ రిజిస్ట్రార్ ఆరోపించారు. మరోవైపు విద్యార్థి సంఘాలు,పలువురు ప్రముఖులు,రాజకీయ నాయకులు మాత్రం ఏబీవీపీ వైపే వేలెత్తి చూపుతున్నారు. జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివేదిక కోరారు. ఇదిలా ఉంటే,ఐషే ఘోష్పై జరిగిన దాడిని ఆమె తల్లిదండ్రులు ఖండించారు. ఈరోజు తమ కుమార్తెపై జరిగిన దాడి రేపు ఇంకెవరిపై అయినా జరగవచ్చునన్నారు. దాడి జరిగినంత మాత్రాన తమ కుమార్తెను ఉద్యమం నుంచి పక్కకు తప్పుకోవాలని కోరమన్నారు. ఘటనకు బాధ్యత వహిస్తూ జేఎన్యూ వీసీ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.