విస్తుపోయే నిజం: ఇండియాలో ప్రతీ 100మందిలో 51మంది ఆధునిక బానిసలు..
న్యూఢిల్లీ: ఇండియాలో సగానికి పైగా జనాభా ఆధునిక బానిసత్వాన్ని అనుభవిస్తున్నారంటూ ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 167దేశాల్లో నాలుగున్నర కోట్ల మంది ప్రజలు బానిసలుగా జీవిస్తున్నారని, అందులో ఒక్క భారత్ లోనే 1.80లక్షల మంది ఉన్నారని పేర్కొంది.
ఇక ఆధునిక బానిసత్వం విషయానికొస్తే.. సగానికి పైగా జనాభా బెదిరింపులకు, వేధింపులకు తలొగ్గి పనిచేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. మానసికంగా, శారీరకంగా ఎలాంటి స్వేచ్చ లేకుండా కేవలం యజమానుల బెదిరింపులకు భయపడి గొడ్డు చాకిరీ చేసేవారిగా ఆధునిక బానిసలను గ్లోబల్ ఇండెక్స్ అభివర్ణించింది.
బలత్కారం, దూషణ, హింస ఇవన్నీ ఆధునిక బానిసత్వంలోని అంశాలని తెలిపింది. ప్రతీ 100మంది ఇండియన్స్ లో 51మంది ఈ ఆధునిక బానిసత్వాన్ని అనుభవిస్తున్నవారే అని పేర్కొంది. పరిశ్రమల్లో, ఇటుక బట్టీల్లో, గనుల్లో వెట్టి చాకిరీ చేయడం, బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దిగడం, బలవంతంగా బిచ్చమెత్తడం.. ఇవన్నీ మోడ్రన్ స్లేవరీగానే పరిగణించాల్సి ఉంటుందని సంస్థ తెలియజేసింది.
ప్రభుత్వేతర సాయుధ దళాల్లో బలవంతపు చేరికలు, భవన నిర్మాణం, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లొ బాండెడ్ లేబర్గా పిల్లలతో పనిచేయించుకోవడం.. వంటి ఆధునిక బానిసత్వంలో భారత్ మగ్గిపోతున్నట్లుగా వాక్ ఫ్రీ సంస్థ తెలిపింది.
ప్రతీ ఏటా జరుగుతున్న మహిళల అక్రమ రవాణాలో ఎక్కువగా మైనర్ బాలికలే అపహరణకు గురవుతున్నారని, వ్యభిచార వృత్తిలో వారు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారని తెలియజేసింది. ఇంట్లో బట్టలు ఉతికి, గిన్నెలు కడిగే పనిమనుషులు కూడా ఆధునికి బానిసత్వాన్ని అనుభవిస్తున్నా.. వారిని ఇంకా ఈ కేటగిరీలో చేర్చలేదు. పనిమనుషులపై కూడా లైంగిక దోపిడీ, బెదిరింపులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీరిని కూడా ఈ కేటగిరీలో చేర్చాలన్న ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.