పబ్లిక్లో అఖిలేష్కు క్లాస్ పీకిన ములాయం
లక్నో: డబ్బు కోసం రాజకీయాల్లోకి రావొద్దంటూ తన పార్టీ నేతలకు సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చురకలంటించారు. ప్రజలకు సేవ చేయ్యటానికి, వారి కష్టాలు తీర్చడానికి రాజకీయాల్లోకి రావాలని ములాయం సింగ్ యాదవ్ సూచించారు.
ఒక వేళ మీరు డబ్బు కోసం రాజకీయాల్లోకి రావాలనే లక్షం ఉంటే వెంటనే రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యాపారం ప్రారంభించుకోండి అని అన్నారు. సమాజ్ వాది పార్టీ నేతలు ప్రజలకు సేవ చెయ్యడంపై దృష్టి సారించాలని చెప్పారు.
ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు కార్పురి ఠాకూర్ జన్మదినోత్సవం వేడుకలు లక్నోలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గోన్న ములాయం సింగ్ యాదవ్ తమ పార్టీ నేతలకు పబ్లిక్ లో క్లాస్ పీకారు.
కొంత మంది శాసన సభ్యులు మహారాజుల్లా ప్రవర్తిస్తున్నారని గుర్తు చేశారు. వారు ఏసీ గదుల్లో నుంచి అస్సలు బయటకు రావడం లేదని, అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తుందని గుర్తు చేశారు.
ఇదే సమయంలో పనిలో పనిగా ములాయం సింగ్ యాదవ్ తనదైన శైలిలో తన కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఝలక్ ఇచ్చారు. అఖిలేష్ నీ మంత్రి వర్గంలోని మంత్రులు వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎంత మంది ఎన్నికవుతారో చెప్పగలవా అంటూ సూటిగా ప్రశ్నించారు.
మంత్రుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, నిర్లక్షం చేస్తే ఫలితం వేరుగా ఉంటుందని అఖిలేష్ యాదవ్ కు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. ప్రతి ఒక్కరిని గమనించడం నీ బాధ్యత అని అఖిలేష్ యాదవ్ కు సూచించారు.
నిర్ణయాలు తీసుకునే సమయంలో తెలివిగా వ్యవహరించాలని, ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ములాయం సింగ్ సూచించారు. మొన్న అధికారుల మీద విరుచుకుపడిన ములాయం సింగ్ ఈ సారి పబ్లిక్ గా తన కుమారుడితో పాటు పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు.