మాస్కు ధరించలేదని ఇంత ఘోరమా-కాళ్లు చేతుల్లో మేకులు దింపిన పోలీసులు?-విచారణకు ఆదేశం
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్,కర్ఫ్యూ నిబంధనలు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు లాఠీలకు పని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల తీరు మితిమీరుతోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించాడన్న కారణంతో ఓ యువకుడిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకుడి కాళ్లు,చేతుల్లో పోలీసులు మేకులు దించి హింసించారని యువకుడి తల్లి ఆరోపిస్తోంది.
అసలేం జరిగింది....
బాధితుడి తల్లి శీలా దేవి కథనం ప్రకారం... బరేలీ జిల్లాలోని జోగి నవాడా పట్టణంలో ఆమె కుటుంబం నివసిస్తోంది. ఈ నెల 24వ తేదీ రాత్రి 10గంటల సమయంలో ఆమె కొడుకు రంజిత్ చల్ల గాలికి ఇంటి బయట నిలబడ్డాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పోలీసులు ముఖానికి మాస్క్ ఏది అని రంజిత్ను ప్రశ్నించారు. రాత్రిపూట,చుట్టూ ఎవరూ లేరు కాబట్టి మాస్కు ధరించలేదని రంజిత్ బదులిచ్చాడు. పోలీసులు అతని మాట వినిపించుకోలేదు. ఏ సమయమైనా,ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాస్కు పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
రెండు రోజులకు గాయాలతో...
మాటా మాటా పెరగడంతో రంజిత్ను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ వెంటనే రంజిత్ తల్లి శీలా దేవి కూడా పోలీస్ స్టేషన్కు వెళ్లి తన కుమారుడి గురించి ఆరా తీశారు. కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది ఎవరూ రంజిత్ గురించి చెప్పలేదు. ఆ తర్వాత రెండు రోజుల వరకు రంజిత్ ఆచూకీ తెలియరాలేదు. బుధవారం(మే 26) కొంతమంది స్థానికులు శీలా దేవి ఇంటికి వచ్చి... రంజిత్ రోడ్డుపై గాయాలతో పడి ఉన్నట్లు చెప్పారు. దీంతో శీలా దేవి అతని వద్దకు పరిగెత్తుకెళ్లారు. రంజిత్ కాళ్లు,చేతుల్లో మేకులు దింపి ఉండటంతో శీలా దేవి షాక్ తిన్నారు.
ఆరోపణలను ఖండించిన పోలీసులు...
ఆ మరుసటి రోజు కుమారుడు రంజిత్ను వెంటబెట్టుకుని శీలా దేవీ స్థానిక పోలీస్ ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు. మరోవైపు,రంజిత్పై తాము ఎలాంటి దాడి చేయలేదని... అతని కాళ్లు,చేతుల్లో మేకులు దింపామన్నది పూర్తిగా అవాస్తవమని అక్కడి పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు,రంజితే తమ పట్ల దురుసుగా ప్రవర్తించాడని... అతనిపై నమోదైన కేసు నుంచి తప్పించుకునేందుకే కొత్త డ్రామాకు తెరలేపాడని ఆరోపించారు. 2019లోనూ రంజిత్పై ఒక కేసు నమోదైందని.. తాగిన మైకంలో ఓ ఆలయంలోకి చొరబడి దేవతామూర్తుల విగ్రహాలను పగలగొట్టాడని తెలిపారు.రంజిత్,అతని తల్లి మాత్రం పోలీసులే అబద్దాలు చెబుతున్నారని... తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు.