తీహార్ జైలుకు తలారి పవన్ జల్లాద్.. నేడు డమ్మీ ఉరితీత..
ఫిబ్రవరి 1న నిర్భయ దోషుల ఉరితీత నేపథ్యంలో మీరట్కి చెందిన తలారి పవన్ జల్లాద్ గురువారం తీహార్ జైలుకు చేరుకున్నాడు. శుక్రవారం అతను డమ్మీ ఉరిని నిర్వహించనున్నాడు. ఉరితాడు పటుత్వంతో పాటు ఇతర విషయాలను అతను పరిశీలించనున్నాడు. డమ్మీ ఉరితీతలో భాగంగా దోషుల బరువుతో సరితూగే ఇసుక బ్యాగులకు ఉరి బిగించి పరిశీలిస్తారు. ఉరితీసే సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఉరి పూర్తయ్యేంతవరకు పవన్ జల్లాద్ జైలు ప్రాంగణంలోనే ఉండనున్నాడు.
నిర్భయ దోషుల ఉరితీతపై పవన్ జల్లాద్ మాట్లాడుతూ.. వారిని ఉరితీయడం తనకు గొప్ప రిలీఫ్ ఇస్తుందన్నారు. తనకే కాదు నిర్భయ తల్లిదండ్రులతో పాటు దేశంలోని ప్రతీ ఒక్కరికి వారి ఉరి సంతోషాన్ని ఇస్తుందన్నాడు. ఇలాంటివాళ్లను ఉరితీయడమే కరెక్ట్ అని పేర్కొన్నారు.
కాగా,ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఇద్దరు తలారిలు మాత్రమే ఉన్నారు. వీరిలో పవన్ జల్లాద్ 2015లో వార్తల్లో నిలిచాడు. అప్పట్లో తనకు రావాల్సిన నెలవారీ భత్యం రూ.3వేలు రానందుకు ఆఫీసర్ల చుట్టూ తిరిగి వేడుకున్నాడు. ఇండియాలో అధికారికంగా నమోదు చేసుకున్న తలారీల్లో పవన్ కుమార్ ఒకరు. గతంలో నిఠారి సీరియల్ కిల్లర్ సురేందర్ కోలిని పవన్ కుమారే ఉరితీశాడు. ఇకపోతే ఫిబ్రవరి 2 ఉదయం ఆరు గంటలకు నిర్భయ కేసులో నలుగురు దోషులు వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ సింగ్ (31), ముఖేష్ కుమార్ సింగ్ (31), పవన్ (26) లను ఉరితీయనున్నారు. నిజానికి ఈ నెల 22న వీరికి ఉరి అమలుకావాల్సి ఉన్నా.. క్షమాభిక్ష పిటిషన్ల కారణంగా ఉరి ఆలస్యమైంది. మొత్తం మీద నిర్భయ ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు దోషులకు శిక్ష పడబోతుంది.