మోడీతో పనిచేయడం అదృష్టం: కేంద్రమంత్రి దత్తాత్రేయ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పని చేయడం తన అదృష్ణమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దుతూ, తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆదివారం కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన బండారు దత్తాత్రేయ చెప్పారు.
సుపరిపాలన, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసే అవకాశం లభించటం తన జీవితంలో ఒక మరపురాని సంఘటనగా గుర్తుండిపోతుందని ఆయన చెప్పారు. వాజపేయి ప్రభుత్వంలో మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన తనకు ప్రధాని మోడీ మంత్రి పదవిని ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి మూడవసారి లోక్సభకు ఎన్నికైన బండారు ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ మంత్రిగా నియమితులవుతారని భావించారు.
అయితే ఆయనకు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రి పదవి లభించింది. వాజపేయి ప్రభుత్వంలో రైల్వే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన పని చేశారు. గతంలోనే ఇండిపెండెంట్ మంత్రిగా పనిచేసిన మీకు ఈసారి కూడా కేబినెట్ హోదా లభించలేదన్న అసంతృప్తి ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన జవాబిచ్చారు. మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరికే పదవి ఇవ్వాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ప్రధానికే ఉందని అన్నారు.

తనకు అప్పగించే ఏ బాధ్యతనైనా శాయశక్తులా నిర్వహిస్తానని బండారు తెలియచేశారు. తెలంగాణ కొత్తగా ఆవిర్భవించింది. కరెంటు, నీరు వంటి అత్యవసర విషయాలలో సమస్యలు పీడిస్తున్నాయి. తెలంగాణతోపాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ను కలుపుకొనిపోతూ సమస్యల పరిష్కారానికి కేంద్రంతో సంప్రదిస్తానని ఆయన చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య వారధిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని బండారు తెలియచేశారు.
మంచి నాయకుడిగా పేరు
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో స్థానం దక్కిన బిజెపి ఎంపి బండారు దత్తాత్రేయ (67) అందరివాడిగా పేరు తెచ్చుకున్నారు. 1947 సంవత్సరం జూన్ 12న పాతనగరంలో జన్మించారు. 1965 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్లో చేరి, 1968 నుంచి 1989 వరకు ప్రచారక్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎమర్జన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్ళారు.
1980 సంవత్సరంలో బిజెపిలో చేరి పార్టీలో వివిధ పదవులు చేపట్టారు. 1997 సంవత్సరంలో బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నియమితులయ్యారు. సికింద్రాబాద్ లోక్సభకు తొలుత 1991 సంవత్సరంలో, ఆ తర్వాత 1998, 1999 సంవత్సరాల్లో, తాజాగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.












Click it and Unblock the Notifications