Haryana elections 2019:హర్యానా బీజేపీ చీఫ్ రాజీనామా
హర్యానా: మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిదానంగా వెలువడుతున్నాయి. అయితే ట్రెండ్స్ చూస్తే మహారాష్ట్రలో బీజేపీ శివసేనలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఎటొచ్చి హర్యానాలో తిరిగి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నించిన బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ట్రెండ్స్ను చూస్తే మ్యాజిక్ ఫిగర్ను టచ్ చేయడం కాషాయం పార్టీకి కష్టమనే తెలుస్తోంది. ఇక బీజేపీని గట్టెక్కించడంలో విఫలమైనందుకు హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా ఆ పదవికి రాజీనామా చేశారు. 40 స్థానాల్లో మాత్రమే బీజేపీ లీడింగ్లో ఉన్నింది. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీకి 46 సీట్లలో గెలుపొందాల్సి ఉంది.
ఇక తొహానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వయంగా పోటీచేసిన సుభాష్ బరాలా విజయావకాశాలు దాదాపు సన్నగిల్లిపోయాయి. ఫతేహాబాద్ జిల్లాలోని తొహానా నుంచి ఆయన బరిలో నిల్చున్నారు. కడపటి వార్తలు అందేసరికి తన సమీప ప్రత్యర్థి జన్నాయక్ జనతా పార్టీకి చెందిన దేవేందర్ సింగ్ బబ్లీ పై 20వేల ఓట్లతో వెనకంజలో ఉన్నారు.ఇదిలా ఉంటే హర్యానాలో హంగ్ అసెంబ్లీ తప్పదనే ట్రెండ్స్ చెబుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఇక జేజేపీ పార్టీ 10 స్థానాల్లో లీడింగ్లో ఉంటూ సత్తా చాటుతోంది. అంతేకాదు కింగ్మేకర్గా అవతరించే అవకాశాలున్నాయి.
బీజేపీకి ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యేందుకు కారణం హర్యానాలో తగ్గిన పోలింగ్ శాతమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019 హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా పడిపోయి 68.47శాతమే జరిగింది. ఇప్పుడు ఇదే బీజేపీ కొంప ముంచింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే బీజేపీ కాంగ్రెస్ల మధ్య చాలా దగ్గరగా పోటీ నెలకొంది. ఇక ఈ ఏడాది మేలో జరిగిన లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే పోలింగ్ శాతం భారీగా ఉన్నింది. దీంతో ఫలితాలు కూడా ముందుగా ఊహించినట్లుగానే వచ్చాయి. స్పష్టమైన మెజార్టీతో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయి.
ఇక ఈసారి హర్యానాకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు ఓటువేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సెలవులు ఉండటంతో చాలా మంది ఓటింగ్కు అందుబాటులో లేరు. అయితే ఇది బీజేపీని దెబ్బతీస్తుందని ఆ పార్టీ ముందుగానే పసిగట్టింది. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓటు వేయడం మరువద్దు అంటూ పదేపదే పిలుపునిచ్చారు. ఓటింగ్ ఒక విధిగా భావించి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.