నిర్మల పద్దు బీజేపీ పరీక్ష పాసైనట్లేనా ? మధ్యతరగతి టార్గెట్ వెనుక ! 2014, 2019 సక్సెస్ మంత్ర !
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్డెట్ మధ్యతరగతిని, ముఖ్యంగా ఉద్యోగుల్ని సంతృప్తి పర్చేలా ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి రాజకీయ ప్రయోజనం కల్పించేలా ఉన్నట్లు తెలుస్తోంది.
2023-24 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయితే అదానీ దెబ్బతో కుదేలవుతున్న స్టాక్ మార్కెట్ మాత్రం ఇవాళ తిరిగి లాభాల్లోకి వచ్చేసింది. అటు వరుస ఎన్నికలు ఎదుర్కోవాల్సిన తరుణంలో జనరంజక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బీజేపీకి ఇది కచ్చితంగా రాజకీయ ప్రయోజనం అందిస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కోబోతున్న నరేంద్రమోడీ ప్రభుత్వం.. ఈ ఏడాది తమ చివరి పూర్తిస్ధాయి బడ్డెట్ ను పార్లమెంటు ముందుకు తెచ్చింది. దీంతో సహజంగానే ఇది దేశంలో అత్యధికంగా ఉన్న ఉద్యోగుల్ని, వేతన జీవుల్ని సంతృప్తి పరిచేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతూ నిర్మల కీలక నిర్ణయం ప్రకటించారు. దీంతో కీలకమైన రాజకీయ పరీక్షలో ఆర్ధికమంత్రి పాసైనట్లు అర్ధమవుతోంది.
అదే సమయంలో దేశంలో స్థూల ఆర్థిక స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణపై విస్తృతంగా దృష్టి పెట్టడం, గ్రీన్ ఎనర్జీ దిశగా దేశాన్ని సిద్ధం చేయడం, ప్రత్యక్ష పన్ను తగ్గింపులు అందించడం, భవిష్యత్ సాంకేతికతల్లో పెట్టుబడులు పెట్టడం, ప్రభుత్వ పెట్టుబడి ఆధారిత మౌలిక సదుపాయాల మార్గంలో కొనసాగడం, స్థానిక తయారీని ప్రోత్సహించడం వంటి వాటిపై నిర్మల ఈసారి విస్తృతంగా దృష్టి పెట్టారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ బడ్జెట్ లో ప్రత్యక్షంగా జనానికి కనిపిస్తున్నప్రయోజనాలు కొన్నయితే పలు పరోక్ష అంశాల్లోనూ జనాకర్షణంగా దీన్ని రూపొందించినట్లు అర్ధమవుతోంది.
ముఖ్యంగా మోడీ హయాంలో బీజేపీ పట్టణ సంపన్న భారతీయుల మద్దతు సంపాదించింది. దీంతో ఈసారి నగరాలు, చిన్న పట్టణాలలో వేతనాలు పొందే మధ్యతరగతి భారతీయులు, యువ వ్యాపారవేత్తలు లేదా దిగువ మధ్యతరగతి కార్మికులు గ్రామీణ పెద్ద భూస్వాములు, చిన్న రైతులు, భూమిలేని కూలీలు, కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఈసారి బడ్జెట్ తీసుకొచ్చింది. ఈ భిన్నమైన వర్గాలలో ప్రతి 10 మందిలో ఐదుగురు నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తే అది కచ్చితంగా బీజేపీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు మంత్రం ఇదేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.