అతనికిద్దరు పెళ్లాలు.. : మెయింటెన్ చేయడానికి ఆ పని తప్పట్లేదట
బెంగుళూరు : ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలవారీ జీతంతో కుటుంబ పోషణ భారమైపోయిన సంగతి తెలిసిందే. అలాంటిది, రెండు పెళ్లిళ్లు చేసుకుని.. రెండు కుటుంబాలనూ పోషించాలంటే..? ఆలోచించడానికేముంది, లో బడ్జెట్ లో హైక్లాస్ పిక్చర్ ను ప్లాన్ చేయడం లాంటిదన్న మాట. ఇదే తరహాలో రెండు పెళ్లిళ్లు చేసుకుని, బ్రతుకును మించిన బడ్జెట్ ను భరించలేక దొంగ అవతారమెత్తాడు బెంగుళూరుకు చెందిన ఓ భర్త.
రోజువారి కూలీతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చే మురళీ రామారావు అనే సదరు భర్త, ఒకరికి తెలియకుండా ఒకరిని.. మొత్తంగా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి వరకు బాగానే ఉంది, కానీ సంసారాన్ని నెట్టుకురావడమే తలకు మించిన భారంగా మారిపోయింది. అసలే ఇద్దరు భార్యలు, అందునా ఒక భార్యకు అనుమానం రాకుండా ఇంకో భార్యతో కాపురం.. చివరికి రెండు కుటుంబాలను ఎలా పోషించాలో తెలియక స్కూటర్ల దొంగగా మారిపోయాడు.
అలా.. దాదాపు రూ.15 లక్షల విలువైన 25 స్కూటర్లను దొంగిలించాడు. ఓ భార్య దగ్గరకు బస్సులో, మరో భార్య దగ్గరకు రోజుకో స్కూటర్ పై వెళ్లడం చేసేవాడు. రెండో భార్య స్కూటర్ల గురించి ఆరా తీస్తే.. స్నేహితుల స్కూటర్లని ఏవో కారణాలు చెప్పి బుకాయించేవాడు. ఇదే క్రమంలో ఈ నెల 5న మంత్రి మాల్ వద్ద హోండా డియో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించబోయిన సదరు దొంగ పోలీసుల చేతికి చిక్కాడు. దీంతో పోలీసుల ముందు చేసిన దొంగతనాల గురించి పూస గుచ్చినట్టు చెప్పేసిన దొంగ, ఇద్దరు భార్యలను మెయింటెన్ చేయడం కష్టంగా మారినందువల్లే దొంగగా మారాల్సి వచ్చిందని వెల్లడించాడు.