coronavirus: మహారాష్ట్రలో స్టేజీ-3కి చేరిన కరోనా వైరస్..? ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ సోకి ఐదుగురు చనిపోగా.. పాజిటివ్ సోకిన వారి సంఖ్య 292కి చేరింది. అయితే మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర వైద్యారోగ్యాశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 63కి చేరింది. దీనినిబట్టి రాష్ట్రం స్టేజీ-3కి చేరిందని.. అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఒక్కరోజే 11 పాజిటివ్ కేసులు..
11 కేసుల్లో.. ఎనిమిది మంది విదేశాల నుంచి వచ్చారని.. మరో ముగ్గురు మాత్రం వారితో కలవడం వల్ల వైరస్ సోకిందని మంత్రి రాజేశ్ తెలిపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 పాజిటివ్, పుణెలో ఒక కేసు నమోదైందని పేర్కొన్నారు. 63 మందిలో 13 విదేశీయుల ద్వారా సోకిందని.. మిగతా కేసులున్నీ విదేశాల నుంచి వచ్చినవారేనని పేర్కొన్నారు.
విదేశాల నుంచి వచ్చినవారితో..
విదేశాల నుంచి వచ్చిన వారితోనే వైరస్ ప్రబలుతోందని మంత్రి చెప్పారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, ఒకవేళ బయటకొచ్చిన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైరస్ సోకుతున్నందున అత్యవసరమైతే తప్ప ప్రయాణించొద్దని.. లేదంటే రవాణాను రద్దు చేస్తామని హెచ్చరించారు. కొన్ని సర్వీసులను ఐడీ కార్డు చూపించాకే అనుమతిస్తామని స్పష్టంచేశారు. ముంబై శివారులో సబర్బన్ రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని.. కానీ ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఏసీలు.. కూలర్లు బంద్..
శీతల ప్రాంతాల్లో వైరస్ ఉంటుందని కేంద్రం, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోందని.. ప్రజలు ఏసీలు, కూలర్లు వాడటం నిలిపివేయాలని మంత్రి కోరారు. కార్యాలయాల పనివేళ తర్వాత నడిచే లోకల్ ట్రైన్లపై కూడా నిఘా పెట్టామని తెలిపారు. కొన్ని షాపులను, జనసముదాయం ఉన్న కార్యాలయాలను మూసివేయాలని కోరామని చెప్పారు. ముంబైని మూసివేయలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను కోరారన్నారు. నివారణ చర్యలపై సీఎం ఉద్దవ్ థాకరే, శరద్ పవార్.. నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కోసం కిట్లను అందజేయాలని పవర్.. హర్షవర్థన్ కోరినట్టు తెలిపారు.