health tips: డయాబెటిస్ కంటే డేంజర్ ఆర్థరైటిస్.. నిర్లక్ష్యం చేస్తే ఆ అవయవాలపై ప్రభావం!!
భారతదేశంలో ఆర్థరైటిస్ అనేది ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. దేశవ్యాప్తంగా 25 శాతం నుండి 30 శాతం వరకు ఆర్థరైటిస్ బారినపడి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు. అక్టోబర్ 12న ప్రపంచ కీళ్ల సమస్యల అవగాహన దినాన్ని పాటిస్తున్నారు.

కీళ్ళ వ్యాధులపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం
ప్రపంచ కీళ్ల సమస్యల అవగాహన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మోకాళ్లు, వాటి కండరాల వ్యాధి సమస్యల పరిష్కారానికి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది చర్య తీసుకోండి అనే ఇతివృత్తం తో ఈ సారి ప్రపంచ కీళ్ల సమస్యలు అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి నేడు ఆర్థరైటిస్ పై అవగాహన కల్పించుకోవాలసిన అవసరం నేపథ్యంలో మీకోసం కీళ్ల వ్యాధులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు..

కీళ్ళ వ్యాధులు రావటానికి కారణం ఇదే .. లక్షణాలివే
కీళ్ల వ్యాధులు రావడానికి ముఖ్య కారణం కదలక మెదలక కూర్చునే మన జీవన శైలి. శరీరంలో కీళ్లకు కదలికలు చాలా అవసరం అవి అరిగిపోతే ఇతర అవయవాల మీద కూడా ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది కాబట్టి, సరైన సమయంలో కీళ్ల సమస్యలను గుర్తించి వైద్యం చేయించుకోవాలి. కీళ్ల నొప్పుల లక్షణాలలో కీళ్ల చుట్టు ఎరుపు రంగు రావడం, నొప్పి, వాపు, గట్టిదనం కనిపించడం మొదలైనవి కొన్ని అని వైద్యులు చెబుతున్నారు. కీళ్లలో కదిలికలు తగ్గిపోతే ఆర్థరైటిస్ గా పరిగణిస్తారు. డయాబెటిస్, హైబీపీ, క్యాన్సర్ లాంటి జబ్బుల కంటే ఈ జబ్బును అత్యంత తీవ్రమైనది గా పరిగణిస్తారు. నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు.

కీళ్ళ వ్యాధుల బారిన పడకుండా చెయ్యాల్సింది ఇదే
ఇంకా చెప్పాలంటే కీళ్ల వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా తగినంత సరైన శారీరక వ్యాయామాన్ని చేయడం, సమతుల ఆహారం తినడం, ఒత్తిడి లేని జీవనశైలి, బరువును నియంత్రించుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వంటి చర్యల ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మొదటి నుండి ఆరోగ్య రక్షణపై అవగాహన ఉంటే కీళ్ళ వ్యాధులను నివారించవచ్చని అంటున్నారు.

కంప్యూటర్ల ముందు పని చేసే వారికి కీళ్ళ వ్యాధుల ముప్పు
కీళ్ల వ్యాధులకు సంబంధించిన మందులు వాడడంతో పాటుగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, చికిత్స తీసుకోకుంటే అది శరీరంలోని ఇతర అవయవాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా రోజూ 8 నుండి 9 గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసే వారిలో కీళ్ల వ్యాధుల సమస్య అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వారు కనీసం ప్రతి పదిహేను ఇరవై నిమిషాలకు ఒకసారి లేచి నిలబడాలని, గంటకు ఒక సారైనా ఐదు నిమిషాలపాటు నడవాలని సూచిస్తున్నారు. కీళ్ళ వ్యాధులు ఎక్కువైతే అంగవైకల్యం బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కీళ్ళ వాతంతో ఇతర అవయవాలపై ఎఫెక్ట్ .. తస్మాత్ జాగ్రత్త
ఇక ఆర్థరైటిస్ వంద రకాలుగా ఉంటుందని గుర్తించినప్పటికీ ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్ గౌట్, ల్యూపస్ అనే
రకాలు ఆర్థరైటిస్ లో ఉంటాయి. ఏ రకమైన సమస్యతో బాధపడుతున్నమో గుర్తించి వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతూ జీవన శైలిలో మార్పులు చేసుకుంటే కీళ్లవాత తీవ్రతను కాస్త తగ్గించుకోవచ్చు. లేదంటే కీళ్ల వాతం కారణంగా కొందరిలో గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినటం, కంటి చూపు కోల్పోవడం వంటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక తస్మాత్ జాగ్రత్త!!
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications